పొట్ట ఎక్కువగా ఉంటే... చీర కట్టుకున్నా... ఆధునిక దుస్తులు వేసుకున్నా ఇబ్బందే. ఈ ఆసనాలతో సులువుగా పొట్టను తగ్గించుకోవచ్చు. చూడచక్కని ఆకృతిని సొంతం చేసుకోవచ్చు. పొట్ట త్వరగా తగ్గాలంటే...
కలయిక తర్వాత దురద... సమస్యా?
నా వయసు 45. ఈ మధ్య తరచూ మూత్రానికి వెళ్లాలనిపిస్తోంది. అలాగే వెజైనా దగ్గర పొడిగా ఉండి దురద పెడుతోంది. కలయికలో పాల్గొన్న తర్వాత ఈ సమస్య మరింత ఎక్కువ అవుతోంది. ఇదేమైనా ప్రమాదమా?
- ఓ సోదరి
ఈ వయసులో డయాబెటిస్, ప్రీ డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇవి ఉన్నప్పుడు తరచూ మూత్రం రావడం, ఆ ప్రాంతం పొడిబారడం, దురదపెట్టడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఊబకాయులైతే షుగరు, హోమా ఐఆర్ పరీక్షలు చేయించుకోవాలి. సాధారణంగా వెజైనాలో వైరల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు కూడా ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. మీరోసారి గైనకాలజిస్ట్ను కలవండి. షుగరు నిర్థరణ అయితే ముందుగా ఆ వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవాలి. సమతుల ఆహారం తీసుకుంటూ వ్యాయామం చేయాలి. ఇన్ఫెక్షన్ తగ్గడానికి దంపతులిద్దరూ మందులు వాడాలి. సమస్య పూర్తిగా తగ్గేవరకు కలయికలో పాల్గొనొద్దు. ప్రీ డయాబెటిక్ స్థితిలో ఉన్నప్పుడు ఇలా ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. యాంటీబయోటిక్స్ ఎక్కువ వాడటం వల్లా ఈ సమస్య రావొచ్చు. మూత్రంలో ఇన్ఫెక్షన్ ఉందేమో కూడా పరీక్ష చేయించుకోండి.
Tags :
...ఆ నిస్సహాయత నుంచే ధాత్రి పుట్టింది!
‘నా ఒక్కదానికే ఎందుకు ఈ కష్టం వచ్చింది?’ అని ఆలోచించే వాళ్లుంటారు.. ‘నాలా ఇంకెంతమందికి ఈ కష్టం వచ్చిందో... వాళ్ల పరిస్థితి ఏంటి’.. అని యోచించేవాళ్లూ ఉంటారు. రెండో కోవకి చెందుతుంది డాక్టర్ శంకారపు స్వాతి. ఉపాధి కోసం కాళ్లరిగేలా తిరిగినా చిన్న ఉద్యోగం కూడా దొరక్క ఆత్మహత్య చేసుకుందామనుకున్న ఆమె... నేడు వేలమంది మహిళలకు నైపుణ్యాలని అందించి వారికో దారి చూపిస్తోంది..
చిత్తూరు జిల్లా మదనపల్లె స్వాతి సొంతూరు. తెలుగులో పీహెచ్డీ పూర్తి చేసిన తర్వాత తల్లిదండ్రులు చూపించిన అబ్బాయిని పెళ్లి చేసుకుని బెంగళూరులో అడుగుపెట్టింది. అంతా బాగానే ఉంది అనుకునే సమయానికి భర్త వ్యాపారంలో తీవ్రమైన నష్టాలు వచ్చాయి. చేతిలో చిల్లిగవ్వలేదు. నిత్యావసరాలు తెచ్చుకోవడానికి కూడా డబ్బు లేక అప్పు చేసి సంసారాన్ని నెట్టుకురావాల్సిన పరిస్థితి. అప్పుల వాళ్ల నుంచి ఒత్తిడి పెరిగింది. దాంతో మరోదారిలేక డిగ్రీపట్టా చేతపట్టి ఉద్యోగవేటలో పడింది స్వాతి. కానీ ఎక్కడకు వెళ్లినా నిరాశే ఎదురయ్యిందామెకు. తన విద్యార్హతకి తగిన ఉద్యోగం బెంగళూరులో దొరకడం కష్టమని కొన్ని రోజులకే అర్థమైపోయింది. కానీ అప్పులిచ్చిన వాళ్ల నుంచి సూటిపోటి మాటలు, గొడవలు అంతకంతకూ ఎక్కువయ్యాయి. ‘సరిగా నిద్ర ఉండేది కాదు. కడుపు నిండా తినడానికి తిండి ఉండేది కాదు. మరోదారిలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. కానీ చదువుకుని, సమాజం గురించి తెలిసిన నేనే కష్టాలను ఎదుర్కోలేక చనిపోవాలనుకుంటే... చదువురాని, లోకజ్ఞానం లేని మహిళలు ఇన్నిన్ని కష్టాలను ఎదుర్కొంటూ జీవితానికి ఎలా ఎదురీదుతున్నారనే ఆలోచన వచ్చింది నాకు. చనిపోయి అందరికీ ఓ జ్ఞాపకంగా మిగిలేకంటే బతికే ధైర్యాన్ని నేర్పాలనిపించింది. నాలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్న ఆడవాళ్లకు అండగా ఉండాలనుకున్నా. అలా నా ఆత్మహత్య ఆలోచన నుంచే ధాత్రి ఫౌండేషన్ పుట్టుకొచ్చింది’ అంటోంది స్వాతి.
ఆత్మవిశ్వాసమే ఆయుధం...
డబ్బు చెల్లించి నేర్చుకునే స్థోమత లేక టైలరింగ్, కుట్లు, అల్లికలు, శారీరోలింగ్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, ఎంబ్రాయిడరీ వంటివాటిని ఆన్లైన్ద్వారా సొంతంగా నేర్చుకుంటూ ప్రతిభను పెంచుకుంది స్వాతి. అందమైన, ఆకట్టుకునే డిజైన్లతో వస్త్రాలను కుట్టిచ్చేది. దీంతో ఆమె పనితనానికి డిమాండ్ పెరిగింది. వచ్చిన డబ్బుతో బొతిక్, టైలరింగ్ షాపులను ప్రారంభించింది. నెమ్మదిగా అప్పులు తీర్చుకుంటూ సంసారాన్ని గట్టెక్కించింది. ఈక్రమంలోనే ఒంటరి మహిళలు, వితంతువులు సమాజంలో పడే కష్టాలను గమనించింది. అలాంటి వారితోపాటు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న మహిళలకు చేయూతనివ్వాలనే లక్ష్యంతో మూడేళ్ల క్రితం ‘ధాత్రి ఫౌండేషన్’ కార్యక్రమాలు మొదలయ్యాయి. తొమ్మిది మందితో ప్రారంభమైన ఈ సంస్థలో నేడు వెయ్యిమందికి పైగా మహిళలు సభ్యులుగా ఉన్నారు. వీరందరికీ వ్యాపార నైపుణ్యాలను, మెలకువలని అందించి వాళ్లు తమ సొంతకాళ్లపై నిలబడేలా చేసింది స్వాతి.
‘ధాత్రి’ సేవా కార్యక్రమాలు...
ఆ రోజు అర్ధాకలితో తను పడిన కష్టం మరొకరు పడకూడదన్న ఉద్దేశంతో ‘ఆహార ధాత్రి’ పేరుతో ఏడాదిగా నిరాశ్రయులకు మూడుపూటలా ఆకలి తీరుస్తోంది. మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే వందమంది రోగులకు అన్నదానం చేస్తోంది. అనారోగ్యంతో బాధపడుతూ ఏ అండా లేని ఆరు కుటుంబాలను దత్తత తీసుకుని.. వారికి నెలనెలా అవసరమైన సాయం అందిస్తుంది. ప్రతినెల రెండో శనివారం ఉచితంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి మందులు పంపిణీ చేస్తోంది. ‘మాకు శ్రామిక ధాత్రి అనే విభాగం కూడా ఉంది. కూలీలకు డబ్బులివ్వలేక ఇబ్బంది పడుతున్న రైతుల పొలాల్లో మేమంతా కలిసి ప్రతి ఆదివారం కలుపు తీసి, వ్యవసాయ పనులు చేసిపెడుతుంటాం. ప్రభుత్వ పథకాల గురించి వాళ్లకు చెబుతాం. చదువు, ఉద్యోగం, పేరు, డబ్బు... వీటిల్లో ఆనందం పరిమితంగా ఉంటుంది. కానీ నిస్సహాయులకు సాయం చేసినప్పుడు వాళ్ల కళ్లలో కనిపించే ఆనందానికి మించిన సంపద మరొకటి ఉండదు’ అనే డాక్టర్ శంకారపు స్వాతి రాష్ట్రస్థాయిలో పలు అవార్డులనీ
అందుకుంది.
Tags :
మీ కంప్యూటర్ నవ్వుతుంది!
ఇదేంటి అనుకుంటున్నారా? కంప్యూటర్లు, రోబోలకు సైతం నవ్వడం నేర్పిస్తున్నారు ఐఐటీ పరిశోధకురాలు డాక్టర్
మామిడి రాధిక. ఇదేదో వినడానికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ!
నవ్వు.. మనుషులకు మాత్రమే పరిమితమైన భావోద్వేగం. దేవుడిచ్చిన వరం. అంతటి గొప్ప వరాన్ని కంప్యూటర్లు, మరమనుషులకు సైతం నేర్పిస్తే.. మనుషులకు మరింత దగ్గరవుతాయి అంటున్నారు రెండున్నర దశాబ్దాలుగా భాషలు, హాస్యంపై పరిశోధనలు చేస్తున్న ట్రిపుల్ ఐటీ ఆచార్యురాలు డాక్టర్ రాధిక మామిడి. ‘రాజమహేంద్ర వరంలో బీఎస్సీ పూర్తి చేశాక.. భాషాశాస్త్రంపై ఆసక్తితో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అప్లయ్డ్ లింగ్విస్టిక్స్లో ఎంఏ చేశాను. అక్కడే ఎంఫిల్, పీహెచ్డీ చేశాను. ఆసమయంలో సాహిత్య అనువాదాలపై థీసిస్ రాయాల్సి ఉంటుంది. అందరూ రవీంద్రనాథ్ ఠాగూర్ రచనల అనువాదం ఎంచుకుంటే నేను మాత్రం ఒకింత సవాల్గా ఉండాలని ఇంగ్లిష్ జోక్స్ను తెలుగులోకి అనువాదం చేసే పని పెట్టుకున్నా. జోక్స్ అనువాదం తేలికైన వ్యవహారంలా అనిపించినా చాలా కష్టమైన పని అది. భాషాశాస్త్ర పరిశోధకురాలిగా గురజాడ అప్పారావు రాసిన కన్యాశుల్కం నాటకంలోని హాస్య సన్నివేశాలను సైతం అప్పుడే విశ్లేషించాను’ అంటారు రాధిక.
పాతికేళ్లుగా పరిశోధనలు...
పాతికేళ్ల క్రితం సీడాక్ ముంబయిలో తన కెరీర్ని మొదలుపెట్టారు రాధిక. అప్పట్లో... మనుషులు కాకుండా యంత్రాలు భాషని అనువాదం చేయడంపై పనిచేశారామె. ఇంగ్లిష్ నుంచి హిందీలోకి యంత్రాల సాయంతో వార్తల్ని అనువదించేవారు. అది మొదలు ఇప్పటివరకూ భాష, సాంకేతికతలపైనే పనిచేస్తున్నారామె. ‘సౌదీ అరేబియాలోని ప్రిన్స్సుల్తాన్ యూనివర్సిటీలో ఆరేళ్లపాటూ కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా పనిచేశాను. 300 పేజీల పుస్తకాన్ని ఒక పేజీలో రాయమంటే మీరు ఆ పుస్తకాన్ని మొత్తం చదివి కానీ రాయలేరు. కానీ మెషీన్ అలా కాదు... ఈ పనిని చాలా తేలికగా చేసిపెడుతుంది. దీనికి సంబంధించిన పాఠాలని విద్యార్థులకు బోధించేదాన్ని. ఆ తర్వాత 2010లో పోలాండ్లో లాఫాల్ పేరుతో అంతర్జాతీయ హాస్య సదస్సు జరిగింది. ఆ సదస్సులోనే భాష- హాస్యం పై పనిచేస్తున్న అనేక మంది ప్రొఫెసర్లను నేను కలిసాను.. నేను ఎంఫిల్లో చేసిన అంశం కూడా అదే కావడంతో యంత్రాలు కూడా హాస్యానికి స్పందించేలా చేయాలని అప్పుడే అనుకున్నాను. మనదేశానికి వచ్చి ట్రిపుల్ ఐటీలోని భాష సాంకేతికత పరిశోధన కేంద్రం(ఎల్టీఆర్సీ)లో చేరాక ఇక్కడ డైలాగ్ సిస్టమ్స్- మెషీన్ ట్రాన్స్లేషన్ అంశంపై పాఠాలు చెప్పేదాన్ని. అంటే ఒక భాషని ఇంకో భాషలోకి యంత్రం సాయంతో అనువదించేటప్పుడు వచ్చే సమస్యలు అధిగమించడం ఎలానో చెప్పేదాన్ని. ఆ పనిచేస్తూనే మరోపక్క కృత్రిమమేధ, మిషన్ లెర్నింగ్ వంటి అంశాలని జోడించి కంప్యూటర్లకు హాస్యం పరిచయం చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించాను. ముందుగా జోక్స్ని కంప్యూటర్ గుర్తిస్తుందా... లేదా? అనే దానిపై పరిశోధన చేశాను. ఇందులో రెండు అంశాలు కీలకం. కంప్యూటర్లు జోక్స్ని గుర్తించి, స్పందించడం ఒకటైతే.. దానికి ప్రతిస్పందనగా తిరిగి జోక్స్ని వేయడం రెండోది. ఈ రెండింటిపైనా నేను పరిశోధనలు చేశా. ఏడాదిపాటు మా బృందంతో కలిసి పరిశోధనలు చేశాక... నా ప్రయత్నం ఫలించింది. కంప్యూటర్ జోక్స్కి స్పందించి.. జోక్స్ని తిరిగి జనరేట్ చేయడం మొదలుపెట్టింది. పెద్దపెద్ద సంస్థలు ఆంగ్లంలో ఉండే హాస్యానికి కంప్యూటర్ ఎలా స్పందిస్తుందనే దానిపై పరిశోధనలు చేస్తున్నాయి. కానీ మన భారతీయ భాషల్లో ఈ ప్రయత్నం చాలా తక్కువగా జరుగుతుందనే చెప్పాలి. తెలుగుకు సంబంధించిన వరకూ మేం చేస్తున్నాం. కన్యాశుల్కం పుస్తకంలోని హాస్యాన్ని అధ్యయనం చేసి ఈ సమాచారాన్ని ముందుగానే కంప్యూటర్లో డేటా రూపంలో నిక్షిప్తం చేశాం. ఆ పుస్తకంలో నవ్వు తెప్పించే వాక్యాలు వచ్చినప్పుడు కృత్రిమ మేధ ఆధారంగా కంప్యూటర్ నవ్వడం, స్పందించడం, తిరిగి జోక్ చేయడం చేస్తోంది. ఈ పరిశోధనలను ఉపయోగించి భవిష్యత్తులో దీన్ని ఓ ఉత్పత్తిగా తీసుకురావాలన్నది నా కల’ అంటున్నారు రాధిక.
- మల్లేపల్లి రమేష్రెడ్డి,
హైదరాబాద్
బుమ్రా క్లీన్బౌల్డ్.. ఎందుకయ్యాడు?
మన యార్కర్ల వీరుడు బుమ్రా మనసు కొల్లగొట్టిన సంజన... గురించే ఇప్పుడు చర్చంతా. వ్యాఖ్యాతగా, టెలివిజన్ హోస్ట్గా మాటలతో మురిపించిన ఆమె కథ తెలుసుకోవాలనే ఆరాటమే అందరికీ... ఎవరీ అమ్మాయి? అంతలా ఏముంది తనలో అని మీరూ అనుకుంటున్నారా? అయితే ఈ ఆసక్తికర విషయాలు మీకోసమే.
సంజన స్టార్ స్పోర్ట్స్ ఛానెల్లో వ్యాఖ్యాత, హోస్ట్. ఆమెకు అన్ని క్రీడల్లోనూ మంచి పట్టుంది. పలు ఐపీఎల్ సీజన్లకి హోస్ట్గా వ్యవహరించింది. మైదానాల్లోకి దిగి ఆటగాళ్లతో మాట కలిపే కొద్దిమందిలో సంజన ఒకరు. ఐపీఎల్ వేలం సమయంలో తన వ్యాఖ్యానంతో ఆకట్టుకుంది. బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగ్, ఇండియా సూపర్ వీక్ ఫుట్బాల్.. సందర్భాల్లోనూ సంజన సందడి షురూ చేస్తుంది. ఆ చలాకీతనమే బుమ్రా మనసు దోచేలా చేసింది.
అందాల భరిణె...
కొద్దిలో మిస్ ఇండియా కిరీటం మిస్ చేసుకుంది. అది ఆమె చిన్ననాటి కల. అందాల పోటీల్లో పాల్గొన్న తర్వాత జనాలకు కొద్దిగా పరిచయమైనా వెలుగులోకి వచ్చింది మాత్రం ఎంటీవీ రియాలిటీ షో స్ప్లిట్స్విల్లా 7 సీజన్లోనే. చేతికి గాయం కావడంతో షో నుంచి అర్థంతరంగా నిష్క్రమించినా ఉన్న కొద్దిరోజుల్లోనే మంచి పాపులారిటీ సంపాదించుకుంది.
ప్రపంచకప్తో పైపైకి...
2019 క్రికెట్ వరల్డ్ కప్తో సంజన స్టార్ ప్రెజెంటర్ అయింది. మ్యాచ్ ముగిసిన తర్వాత నిర్వహించే ‘మ్యాచ్ పాయింట్’, ‘చీకీ సింగిల్స్’ కార్యక్రమాలు తన చలోక్తులతో పేలిపోయేవి. క్రికెట్ పండితులంతా తనని ‘బ్యూటీ విత్ మైండ్’ అని పొగిడేవాళ్లు.
చదువులో మెరిట్..
సంజన పుణె అమ్మాయి. అక్కడే పుట్టిపెరిగింది. మొదట్నుంచీ చదువుల్లో బాగా చురుకైన అమ్మాయి సంజన. సింబయాసిస్ నుంచి ఇంజినీరింగ్లో గోల్డ్ మెడల్ అందుకుంది. ఐటీ, డిజిటల్ మార్కెటింగ్ కంపెనీలో కొన్నాళ్లు సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేసింది. కాలేజీలో ఉండగానే ఎప్పటికైనా నేను మిస్ ఇండియా అవుతానని స్నేహితులతో చెప్పేది. దానికి అనుగుణంగానే కాలేజీ పూర్తవగానే నడక, నడత, వ్యాయామం, ఆహారం అన్నింట్లో జాగ్రత్తలు తీసుకునేది. ఏడాదిపాటు ఉద్యోగం చేశాక ముంబయికి మకాం మార్చి మోడల్గా కెరీర్ మొదలుపెట్టింది. ఈ సంగతులన్నీ చెబుతూ వాషీ టెడెక్స్లో స్ఫూర్తిదాయకమైన స్పీచ్ ఇచ్చింది.
అలా మొదలైంది...
బుమ్రా, సంజనా ప్రేమకథ విషయానికొస్తే వీళ్ల రొమాన్స్ క్రికెట్ మైదానంలోనే మొదలైందంటారు. సంజనా అప్పుడప్పుడే క్రీడా వ్యాఖ్యాతగా కెరీర్ మొదలుపెట్టింది. 2013-2014 ఐపీఎల్ సీజన్లో అతడిని ఇంటర్వ్యూ చేయడంతో ఇద్దరి మధ్య పరిచయం మొదలైంది. కొన్నాళ్లకే మంచి స్నేహితులయ్యారు. కెరీర్, ఫేమ్తోపాటు ఇద్దరి మధ్య ప్రేమ కూడా వేగం అందుకుంది. అవార్డుల కార్యక్రమం ‘నమన్’తో మరింత దగ్గరయ్యారు. పార్టీలు, చాటుమాటుగా కలుసుకోవడాలు మామూలయ్యాయి. ఎట్టకేలకు పెద్దల ఆమోదంతో ఇద్దరూ పెళ్లి పీటలెక్కారు.
బాల సాహిత్యం తేలికేంకాదు!
బాల సాహిత్యంలో అలుపెరుగని అక్షర సేద్యం చేస్తున్నారు రచయిత్రి కన్నెగంటి అనసూయ. పిల్లల కోసం వందల కథలు రాసిన ఆవిడ ఈ ఏడాది కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కారానికి ఎంపికయ్యారు. సమాజ సేవలోనూ ముందుండే ఆమె తన సాహిత్య, సమాజ సేవ గురించి ఏమంటున్నారంటే..
మా స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం పశివేదల. సీఆర్ రెడ్డి కాలేజీలో గ్రంథాలయాధికారిగా 11 ఏళ్లు పనిచేశా. పౌరశాస్త్ర అధ్యాపకురాలిగా పాఠాలు చెప్పా. తర్వాత వ్యాపార రంగంలోకి వచ్చా. 1977లో పదో తరగతిలో తొలి కథ రాశా. చిన్నప్పటి నుంచి వక్తృత్వ, వ్యాసరచన పోటీల్లో పాల్గొనేదాన్ని. వాటిలో బహుమతిగా వచ్చిన పుస్తకాలతో బడిలో గ్రంథాలయం ఏర్పాటుచేశా. స్కూల్, కాలేజీ మ్యాగజీన్లకు కూడా రచనలు చేసేదాన్ని. డిగ్రీలో కళాశాల మహిళా ప్రతినిధిగా ఎన్నికయ్యా. అప్పుడు పత్రికలకు వ్యాసాలు, ఇంటర్వ్యూలు చేసేదాన్ని. వాళ్లిచ్చే పారితోషికంతో కాలేజీ వెయిటింగ్ రూంలో మహిళలకు వసతులు కల్పించా.
అదో తపస్సు..
గ్రంథాలయాధికారిగా పనిచేస్తున్నప్పుడు పుస్తకాలతో అనుబంధం పెరిగింది. కథలు, కవితలు రాయడంలో పరిణతి వచ్చింది. మూడు వందలకు పైగా పెద్దల కథలు, దాదాపు ఆరువందల చిన్న పిల్లల కథలు రాశా. ఐదు కథా సంపుటాలు, నవలలు వెలువరించా. ఇప్పటి వరకూ 24 పురస్కారాలు అందుకున్నాను. ప్రస్తుతం పురస్కారం వచ్చిన ‘స్నేహితులు’ పుస్తకం 2018లో ప్రచురితమైంది. రెండేళ్ల కిందట పిల్లల కోసం కథల వర్క్షాపులు నిర్వహించడం ప్రారంభించాను. చిన్న పిల్లలకు కథా పోటీలు పెట్టి బహుమతులు అందిస్తున్నా. బాలసాహిత్యంపై రచయితల్లో కూడా కాస్తంత చులకన భావం ఉంది. కానీ, బాల సాహిత్యం ఒక తపస్సు. పిల్లల కోసం పిల్లల్లాగే మారి రాయడం అంత తేలిక కాదు.
2009లో స్నేహితులతో కలిసి ‘మానస’ స్వచ్ఛంద సంస్థ స్థాపించా. దీని తరఫున ‘గుప్పెడు బియ్యం’ కార్యక్రమం ద్వారా వందల బస్తాలు సేకరించి పంచిపెట్టాం. ఫేస్బుక్ మిత్రుల నుంచి రూ.లక్షా పదివేలు సేకరించి చేర్యాల మండలంలో ఆత్మహత్య చేసుకున్న 11 మంది అన్నదాతల కుటుంబాలకు అందించాం. మావారు కన్నెగంటి రవికుమార్ చార్టర్డ్ అకౌంటెంట్. మాకు ఇద్దరబ్బాయిలు, ఒకమ్మాయి. తల్లిదండ్రులు పిల్లలకు సమయం కేటాయించకపోవడం ఇప్పుడు పెద్ద సమస్య. దీంతో చిన్నారులు టీవీలు, వీడియోగేముల్లో మునిగిపోయి హింసా ప్రవృత్తిని అలవరచుకుంటున్నారు. అందుకే అమ్మానాన్నలు పిల్లలకు తప్పకుండా కథలు చెప్పాలి. పిల్లలతోనే వారి కథల్ని రాయించడం నా లక్ష్యం. దీని కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్క్షాపులు నిర్వహిస్తా.
పిల్లల్ని చక్కటి పౌరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో రచనలు చేస్తున్న నాకు ఈ పురస్కారం మంచి ప్రోత్సాహం. ప్రస్తుతం చిన్నపిల్లల్ని చూస్తుంటే జాలేస్తోంది. చదువుల ఒత్తిళ్లలో వాళ్లు తీవ్ర అలసటకి గురవుతున్నారు. ఇంట్లో పెద్దవాళ్లు లేకపోవడం, తల్లిదండ్రులకు తీరిక దొరక్కపోవడంతో పిల్లలకు కథలు చెప్పేవాళ్లు కరవయ్యారు. కథల ద్వారా పిల్లల్లో ఊహాశక్తి, భాషా పరిజ్ఞానం పెరుగుతాయి.
- వేణుబాబు మన్నం
Tags :
పెట్టుబడి రూ.100... లాభం లక్షల్లో!
బాల్యం నుంచి వ్యాపార రంగంలో అడుగుపెట్టాలని ఆమె కల.. తెలిసిన పాకశాస్త్రాన్నే ఎంచుకుని.. లాభాలు గడించింది. అంతలోనే చోరీకి గురైన ఆమె దుకాణం నష్టాల్లోకి నెట్టేసింది చేతిలో పైసా లేదని కూర్చోలేదు రూ.100 పెట్టుబడితో తిరిగి వ్యాపారిగా నిలదొక్కుకుంది తనను నమ్ముకున్న మహిళలందరికీ తిరిగి ఉపాధిని కల్పించింది స్ఫూర్తి కథనాలు చదివి ఎదిగిన ఈమె మరెందరికో మార్గదర్శకంగా నిలిచింది. ఉత్తమ వాణిజ్యవేత్తగా అవార్డునూ అందుకుందీ... కేరళకు చెందిన ఇలవరసీ జయకాంత్. జీరో స్థాయి నుంచి ఎదిగి తనను తాను నిరూపించుకున్న ఈమెపై స్ఫూర్తి కథనం...
ఇలవరసీ ఇంట్లో తాతల కాలం నుంచి తల్లిదండ్రుల వరకు అందరూ స్వీట్లు, కారాలు, చిప్స్ తయారుచేసేవారు. వాటిని ఇంటింటికీ తిరిగి విక్రయించేవారు. చుట్టుపక్కల గ్రామాల్లో వారితోపాటు తాను కూడా అమ్ముతూ, తన వంతు సాయం చేసేదీమె. అలాగే అమ్మమ్మ, అమ్మతో కూర్చుని వారు వండే వంటకాల గురించి తెలుసుకుంటూ, అడిగి తయారుచేయడమెలాగో నేర్చుకునేది. తానూ పెద్దైన తరువాత వారిలాగే ఇదే రంగంలో అడుగుపెట్టి మంచి వ్యాపారవేత్తగా ఎదగాలని చిన్నప్పటి నుంచి కలలు కనేది.
పెళ్లై అత్తారింటికి వచ్చిన ఆమెకి మనసులో ఆలోచన మాత్రం అలాగే ఉండిపోయింది. భర్తతో తన కల గురించి చెప్పింది. అత్తింటి సహకారంతో పలురకాల స్వీట్లు, స్నాక్స్ చేసి ఇంటికి చుట్టుపక్కల ఉండే దుకాణాలకు అమ్మేది. వినియోగదారులు ఇష్టపడితే వాటిని మళ్లీ వండి తీసుకొస్తానని చెప్పేది. అలాగే పొరుగువారికీ తన వంటల రుచిని చూపించేది. అలా కొన్నాళ్లకు ఇలవరసీ వంటల రుచికి అందరూ ఫిదా అయిపోయేవారు. ఇళ్లకు, చిన్నచిన్న దుకాణాలకు మాత్రమే కాకుండా చిన్న సూపర్మార్కెట్లా తెరవాలనుకుంది. అదే విషయం భర్తకు చెప్పి, ఆయన అనుమతితో త్రిసూరులో ప్రారంభించాలనుకున్నారు. దాంతో అప్పటివరకు పొదుపు చేసిన నగదుతోపాటు, తెలిసినవారి వద్ద, బ్యాంకులో రుణాన్ని తీసుకుని రూ.50 లక్షలు పెట్టుబడితో పదేళ్లక్రితం చిన్న మార్ట్ను ప్రారంభించింది. ఇందులో రకరకాల స్నాక్స్, చిప్స్ను ప్రత్యేకంగా ఉంచేది.
విక్రయాలు పెరిగి..
ఇలవరసి వంటకాలను ఎక్కడెక్కడి నుంచో వచ్చి కొనుగోలు చేసేవారు. నెమ్మదిగా వ్యాపారం అభివృద్ధి చెందింది. 50 మంది పేద మహిళలకు అందులో ఉపాధిని కల్పించింది. వినియోగదారుల అభిరుచినీ దృష్టిలో ఉంచుకుని రకరకాల వంటకాలను తయారుచేసేదీమె. అలా హల్వా, కేకులు, చిప్స్ నుంచి కూరగాయలు, నిత్యావసరవస్తువుల సంఖ్యనూ పెంచింది. నెమ్మదిగా అప్పులు తీరుస్తున్న సమయానికి అనుకోని సంఘటన చోటు చేసుకుంది. ఓ అర్ధరాత్రి దుకాణంలో దోపిడి జరిగింది. ఓవైపు బ్యాంకు రుణం, తెలిసినవారి వద్ద తీసుకున్న అప్పులు ఆమెను చుట్టుముట్టాయి. దాంతో తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిపాలైంది.
కొన్ని నెలలపాటు ఆసుపత్రిలోనే గడిపిన తనకు జీవితమేంటో తెలిసింది అని చెబుతోందీమె. ‘ఆసుపత్రి నుంచి వచ్చాక తిరిగి వ్యాపారం మొదలుపెడదామనుకున్నా. చేతిలో చిల్లిగవ్వ లేదు, ఇంట్లోవాళ్లు వద్దన్నారు. అప్పటికి చేతిలోని రూ.100 పెట్టుబడి అయ్యాయి. ‘అశ్వతి హాట్ చిప్స్’ పేరుతో త్రిసూరు రైల్వేస్టేషన్ వద్ద చిన్న కొట్టు తెరిచా. గారెలు, చిప్స్ను రైలు ప్రయాణికులకు విక్రయించేదాన్ని. అలా కొన్నినెలలపాటు కష్టపడ్డా. నా కష్టం చూసి కుటుంబం అండగా నిలబడింది. అలా ఆర్నెళ్లలో వ్యాపారం నిలదొక్కుకుంది. ఎనిమిదేళ్లలో మొత్తం అప్పులు తీరిపోగా, మరో నాలుగు శాఖలనూ ప్రారంభించాం. ఇప్పుడు నెలకు అయిదు లక్షల రూపాయలను సంపాదించగలుగుతున్నా. మరికొందరు మహిళలకు ఉపాధినీ చూపించగలిగా. నా పట్టుదల, కృషికి గుర్తింపుగా 2019లో ‘ఇంటర్నేషనల్ పీస్ కౌన్సిల్ యుఏఈ అవార్డు’ పేరుతో ఉత్తమ వాణిజ్యవేత్తగా పురస్కారాన్ని అందుకున్నా’ అని చెబుతోంది ఇలవరసి.
Tags :
ఆగిన చదువుకు ఆమె సాయం!
హైదరాబాద్లో ఉండే స్వరూప దంపతులు రాళ్లుకొట్టే పని చేసుకొని బతుకుతున్నారు... చదివించే స్థోమత లేక పదో తరగతి తర్వాత కొడుకుని తమతో కూలిపనికి తీసుకెళ్లాలనుకున్నారు... బాగా చదివే ఆ కుర్రాడు కూలీపనికి వెళ్లడం అతని క్లాస్ టీచర్కి నచ్చలేదు. అందుకే ఆ పేద దంపతులని సెవెన్ రేస్ ఫౌండేషన్ని నిర్వహించే సారా దగ్గరకు వెళ్లమని సలహా ఇచ్చిందామె. ఇప్పుడా కుర్రాడు శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ బైపీసీ చదువుతున్నాడు.....
హైదరాబాద్లోని మల్కాజ్గిరికి చెందిన సారా ఐటీ ఉద్యోగిని. ఉద్యోగంతో పాటూ... ఎన్నో ఏళ్లుగా సేవా కార్యక్రమాలూ చేస్తున్నారామె. మొదట్లో చిన్నగా ప్రారంభించి... తర్వాత నగరమంతటా తన సేవల్ని విస్తరించింది. ప్రధానంగా హైదరాబాద్లోని వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాల్లో ఉండే వారి అవసరాలపై దృష్టి పెట్టింది. లాక్డౌన్ సమయంలో అన్నార్తుల ఆకలిని తీర్చేందుకు ఇల్లిల్లూ తిరిగిన సారాను ఎక్కువగా కలిచివేసిన విషయం పేదపిల్లల చదువు. కొవిడ్ కారణంగా ఉపాధి కోల్పోయిన ఎంతోమంది తల్లిదండ్రులకి పిల్లల చదువులు భారమయ్యాయి. దాంతో చాలామంది పిల్లలు చదువుకి మధ్యలోనే దూరమవడం స్వయంగా చూసింది సారా. అలాంటి పిల్లల బాధ్యతని తాను తీసుకుని వాళ్లని మంచి కాలేజీల్లో చదివించాలనుకుంది. అలా సుమారు పాతికమంది పిల్లలకు ఆర్థిక సాయం అందించి... వాళ్లని నారాయణ, శ్రీచైతన్య, గీతం, వెస్లీ వంటి కార్పొరేట్ కళాశాలల్లో చేర్పించి వాళ్ల ఫీజులని తనే కడుతోంది. అందులో చాలామంది ఇళ్లలో పనిచేసుకుని పొట్టపోసుకునే వాళ్ల పిల్లలే. సారా చేసిన ఆర్థిక సాయం వల్ల ఈ రోజు వారంతా ఇంజినీరింగ్, ఫార్మా వంటి ఉన్నత కోర్సులు చదువుతున్నారు. ‘చాలామంది తల్లిదండ్రులకు తమ పిల్లలని గొప్ప చదువులు చదివించాలని... మంచి ఉద్యోగాల్లో స్థిరపడితే చూడాలనే కోరిక బలంగానే ఉంది. కానీ కూలీనాలీ చేసుకునేవారికి ఇదేం చిన్న భారం కాదు. అందుకే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, డ్రాపవుట్లు, తండాల్లో ఉండే చిన్నారులు, ఒంటరి తల్లుల దగ్గర పెరుగుతున్న పిల్లలకు అండగా ఉండాలని అనుకున్నా. కేవలం కార్పొరేట్ కళాశాలల్లో అడ్మిషన్లు ఇప్పించి ఊరుకోవడం కాకుండా... వాళ్లలో ఆసక్తి ఉండి పోటీ పరీక్షలకు వెళ్లాలనుకునేవారికి సైతం ఫీజులు చెల్లించాలనుకుంటున్నా. దాతలు, సామాజిక మాధ్యమాలు, ప్రముఖుల సహకారంతో ఈ యజ్ఞం నిర్విరామంగా సాగుతోంది’ అనే సారా తాజాగా రంగారెడ్డి జిల్లాలోని రెండు తండాలను దత్తత తీసుకొని అక్కడి పిల్లల చదువు, మహిళల ఉపాధి కార్యక్రమాలపై దృష్టి పెట్టింది.
-పత్తిపాక ప్రవీణ్కుమార్, ఈటీవీ
Tags :
మిస్సైల్ పాఠాలు నేర్పింది కలాం!
నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం
‘ఓ అమ్మాయి శాస్త్రవేత్త అవడమా!’ అని ఆశ్చర్యపోయే రోజుల్లోనే డీఆర్డీవోలో అడుగు పెట్టారామె! డాక్టర్ ఏపీజేఅబ్దుల్కలాం ఆ సంస్థకు డైరెక్టర్గా ఉన్న రోజులవి.. స్వయంగా ఆయనిచ్చిన ధైర్యంతోనే అగ్ని, పృథ్వి వంటి క్షిపణి పరిశోధనల్లో పాల్గొన్నారు.. ఆ స్ఫూర్తినే కొనసాగిస్తూ... కొత్తగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ల్యాబ్లో శాటిలైట్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా బాధ్యతలు తీసుకున్నారు తెలుగింటి ఆడపడుచు రాణీ సురేందర్...
రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) తన అవసరాల కోసం కొత్తగా ఉపగ్రహాలపై పరిశోధనలు మొదలుపెట్టింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక ల్యాబ్ ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్ట్కు తెలుగు మహిళా శాస్త్రవేత్త రాణి సురేందర్కు డైరెక్టర్గా బాధ్యతలు అప్పగించింది. ఆమె తన ప్రస్థానం ఇలా వివరించారు. ‘మా స్వస్థలం గుడివాడ దగ్గర కుదరవల్లి. నేను పుట్టింది మాత్రం హైదరాబాద్లోనే. నాన్న కేఆర్కే మూర్తి హెచ్ఎంటీలో ఇంజినీర్ కావడంతో నేనూ ఆ రంగంపైనే ఆసక్తి పెంచుకున్నా. విజయవాడలో ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్స్లో బీటెక్ పూర్తిచేశా. మా అమ్మ పెద్దగా చదువుకోలేదు కానీ పిల్లలు బాగా చదువుకోవాలని పట్టుదలగా ఉండేది. ఆమె ఇచ్చిన ప్రోత్సాహంతోనే నేను డీఆర్డీవోలాంటి ప్రతిష్ఠాత్మక సంస్థలో అడుగుపెట్టాననిపిస్తుంది. మొదట్లో డీఆర్డీవో తనకు కావాల్సిన శాస్త్రవేత్తలని తయారుచేసుకునేందుకు కొన్ని కోర్సులు నిర్వహించేది. అలా నేను గైడెడ్ మిస్సైల్స్ కోర్సు చదివి.. 1987లో శాస్త్రవేత్తగా చేరా. అప్పుడు మా డైరెక్టర్ అబ్దుల్ కలాం. అక్కడ చేరిన వెంటనే ఆయనను కలుసుకోవడానికి వెళ్లా. అదే మొదటిసారి ఆయనను చూడటం. ఎంటెక్లో నేను చేసింది ప్రాజెక్ట్ కంట్రోల్ సిస్టమ్స్ కావడంతో ‘ఈ పనికి నువ్వు సరిగ్గా సరిపోతావు’ అని అన్నారు. నాతో మాట్లాడిన అరగంటలో... ఎన్నో విషయాలు చెప్పారు. అది మొదలు రెండేళ్లపాటు ఆయనతో కలిసి పనిచేశాను. ఆయనిచ్చిన ప్రోత్సాహం వల్లే నాలో ఉన్న ఎన్నో భయాలు తొలగిపోయాయి. మిసైల్స్ తయారీ కోసం అప్పటివరకు మన దేశంలో ఒకే ల్యాబ్ ఉండేది. కానీ కలాంగారి చొరవతో ఆర్సీఐ(రీసెర్చ్ సెంటర్ ఇమారత్) ఏర్పాటు అయ్యింది. 1989 నుంచి ఆ ల్యాబ్లోనే క్షిపణుల కమ్యూనికేషన్కు సంబంధించి వాడే సీకర్స్పై పరిశోధనలు మొదలుపెట్టా. కలాం నేతృత్వంలోని అగ్ని, పృథ్వి వంటి క్షిపణి పరిశోధనల్లో పాలుపంచుకునే అవకాశం వచ్చింది నాకు.’ అంటారు రాణి.
ఆ మిస్సైల్ నా విజయం...
‘క్షిపణి కోసం పనిచేయడం అంటే మాటలు కాదు. ఏ చిన్నపొరపాటు జరిగినా... దాన్ని సరిచేయడానికి వారాలు.. నెలలు కూడా పడుతుంది. ఇందుకోసం సమయం చూసుకుని పనిచేయలేం. కానీ దేశం కోసం చేసే ఈ పని ఎంతో సంతృప్తినిస్తుంది’ అని అంటారామె. ‘ఒక క్షిపణిలో ఎన్నో ఉప వ్యవస్థలు ఉంటాయి. వాటన్నింటిపైనా అవగాహన ఉన్నప్పుడే మన పని తేలిక అవుతుంది. శాస్త్రవేత్తగా చేరిన మొదట్లో కష్టం అనిపించినా క్రమంగా అన్నీ తెలుసుకుంటూ ముందడుగు వేశా. ఏదైనా సమస్య తలెత్తితే ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకునేందుకు, దాన్ని సరిదిద్దేందుకు వారం నుంచి రెండు నెలల సమయం పట్టేది. అలాంటప్పుడు రాత్రీపగలు పనిచేయాల్సి వచ్చేది. నా కెరీర్లో రెండు మిసైల్స్ కోసం పనిచేశా. 2011లో ‘మిల్లీ మెట్రిక్ వేవ్’ సీకర్ సిస్టమ్లో పనిచేయడం నా జీవితంలో సాధించిన పెద్ద విజయం. కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న వస్తువులను ఎలాంటి వాతావరణంలోనైనా గుర్తించి ఛేదించగలిగే సామర్థ్యం దీనికుంది.’ అంటూ కెరీర్లో తనకెదురయిన సవాళ్లని వివరించారు.
బాబుని అత్తగారికి అప్పగించి...
‘నెలలు తరబడి కష్టపడి పనిచేసిన తర్వాత మిసైల్స్ని పరీక్షించేందుకు ఒడిశాలోని బాలాసోర్ వెళ్లి అక్కడే కొన్ని రోజులు గడపాల్సి వచ్చేది. నేను ఉద్యోగంలో చేరిన మూడునాలుగు నెలల వ్యవధిలోనే ఇంజినీర్ సురేందర్తో పెళ్లైంది. రెండేళ్లకే బాబు పుట్టాడు. వాడిని మా అత్తగారికి అప్పగించి మిస్సైల్ పరీక్షల కోసం వెళ్లేదాన్ని. మిసైల్ లాంచ్ చేయడం నుంచి ఆ తర్వాత లక్ష్యాన్ని చేరిందా లేదా అని పరీక్షించడం వరకు ఎన్నో పనులుంటాయి. ఇందుకోసం ఒక్కోసారి నెలరోజులు కూడా అక్కడే ఉండిపోవాలి. కుటుంబ సహకారం లేకపోతే ఇవన్నీ చేయగలిగేదాన్ని కాదేమో’ అంటారు రాణి.
అవకాశాలు ఉన్నాయ్..
‘మహిళలకు డీఆర్డీవోలో చాలా అవకాశాలున్నాయి. ఇక్కడ పురుషులు, స్త్రీలు అనే వివక్ష ఎప్పుడూ లేదు. ప్రారంభంతో పోలిస్తే ఇప్పడు మహిళా శాస్త్రవేత్తల సంఖ్య బాగా పెరిగింది. కొత్తగా యువ శాస్త్రవేత్తల కోసం ల్యాబ్లు కూడా ఏర్పాటు అయ్యాయి. క్షిపణులు, యుద్ధ ట్యాంకుల రూపకల్పనతో పాటూ ... ఉపగ్రహాలు, కృత్రిమ మేధ], క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి వేర్వేరు అంశాలపై డీఆర్డీవో పనిచేస్తోంది. రక్షణ రంగంలో అంకుర సంస్థలు ఎన్నో వస్తున్నాయి. అవకాశం వచ్చినప్పుడు సవాళ్లను స్వీకరించి మహిళలు తమ శక్తి సామర్థ్యాలను చూపాలి. మహిళలు సైతం అన్నీ చేయగలరని నిరూపించాలి... ఇదీ రాణి అంతరంగం.
- మల్లేపల్లి రమేష్ రెడ్డి, హైదరాబాద్
Tags :
ఆ ఆలోచనల నుంచి బయటపడేదెలా?
నాకు చిన్నప్పట్నుంచీ అన్నీ కష్టాలే. పెళ్లైన చాలాకాలం వరకూ సంతానం కలగలేదు. దాంతో ఓ వైపు అత్తింటివారి దెప్పిపొడుపులు.. అర్థం చేసుకోలేని భాగస్వామి.. నిరంతరం వెంటాడే ఆర్థిక సమస్యలు.... ఇప్పుడు భర్త అనారోగ్యం.... వీటన్నింటిని భరించలేకపోతున్నా. ఒక్కోసారి వీటన్నింటి నుంచి తప్పించుకోవాలంటే చావే పరిష్కారమనిపిస్తోంది. కుటుంబం గుర్తొచ్చి ఆ ఆలోచనను మానుకుంటున్నా.ఈ ప్రతికూల ఆలోచనల నుంచి బయటపడే మార్గం లేదా?
- ఓ సోదరి
చిన్నప్పటి నుంచీ మీకు ఎదురైన చెడు సంఘటనలు, చేదు అనుభవాలు మీరిలా ఆలోచించడానికి కారణం అవ్వొచ్చు. కష్టాల్లోనే పెరగడం వల్ల మీరు వాటికి మానసికంగా అలవాటైపోయి ‘నా జీవితమంతా ఇంతే’ అనే భావనలో ఉండిపోయారు. పెళ్లి తర్వాత కూడా సమస్యలు తగ్గకపోగా మరింత పెరగడంతో నా జీవితమంతా ఇబ్బందులమయమే అన్న నిర్ణయానికి వచ్చారు. జీవితంలో కష్టసుఖాలూ రెండూ ఉంటాయి. ప్రతిఒక్కరికీ ఇవి ఎదురవుతాయి. జరిగిన మంచి విషయాలను ఓసారి గుర్తుకు తెచ్చుకోండి. గతంలో మీరు సమస్యలు అధిగమించిన తీరుని మననం చేసుకోండి. అప్పటికీ వాటి నుంచి బయటపడలేకపోతుంటే మీరొకసారి మానసిక నిపుణులను సంప్రదించండి. ప్రతికూల ఆలోచనలు మొదలయ్యాక అంత త్వరగా అవి తగ్గడం కాస్త కష్టమే. మీలో కొంచెం కుంగుబాటు, ఆందోళన, జీవితాన్ని అంతం చేసుకోవాలనే ఆలోచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి డిప్రెషన్కు మందులు వాడటం మంచిది. దాని తర్వాత కాగ్నెటివ్ బిహేవియర్ థెరపీ ద్వారా మీ ప్రతికూల ఆలోచనలను తగ్గిస్తారు వైద్యులు.
Tags :