Published : 06/07/2021 07:08 IST HYD: హైదరాబాద్ టు ముంబయి! శంషాబాద్లో విమాన ప్రయాణికుల రద్దీ ఈనాడు, హైదరాబాద్: నగరం నుంచి విమాన ప్రయాణాలు ఊపందుకుంటున్నాయి. హైదరాబాద్లోని జీఎంఆర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జూన్లో ప్రయాణికుల సంఖ్యలో పెరుగుదల కనిపించింది. గత నెలలో 4 లక్షల మంది దేశీయ, 35 వేల మంది అంతర్జాతీయ ప్రయాణాలు సాగించారు. కరోనా రెండో దశకు ముందు నెలకు 10 లక్షల మంది రాకపోకలు సాగించేవారు. రెండో దశ సమయంలో ఆ సంఖ్య రెండు లక్షలకు పడిపోయింది. ప్రస్తుతం కేసులు సంఖ్య తగ్గుదలతో ప్రయాణికులు పెరుగుతున్నారు. * ఈ ఏడాది జూన్ 1న పది వేల మంది ప్రయాణించగా, ఈ సంఖ్య 27వ తేదీకి 22 వేలకు చేరింది. * హైదరాబాద్ నుంచి దిల్లీ, ముంబయి, బెంగళూరు, అహ్మదాబాద్, విశాఖపట్నానికి రాకపోకలు అధికంగా ఉన్నాయి. ఇందులో ముంబయికి వెళ్లే ప్రయాణికుల సంఖ్యను మే నెలతో పోల్చితే.. జూన్లో ఏకంగా 84 శాతం వృద్ధిరేటు కనిపించింది. ముంబయిలో కరోనా ఉద్ధృతి కారణంగా వాయిదా వేసుకున్న ప్రయాణాలను జూన్లో షెడ్యూల్ చేసుకున్నారు. * ప్రయాణికులకు 72 గంటల ముందు ఆర్టీపీసీఆర్ పరీక్షలో నెగిటివ్ వస్తేనే.. కొన్ని రాష్ట్రాలు అనుమతిస్తున్నాయి. ఈ కారణంగా తోటి ప్రయాణికులతో ఇబ్బంది లేదన్న ఉద్దేశంతో విమానయానానికి ఆసక్తి చూపుతున్నారు. * విమానాశ్రయం నుంచి గత నెల 1న వంద విమానాలు రాకపోకలు సాగించగా, 27వ తేదీకి ఈ సంఖ్య 199కి చేరింది. ఇదే సమయంలో రద్దీ లేని కారణంగా 13 నగరాలకు ఇంకా సర్వీసులు ప్రారంభం కాలేదు. కరోనా రెండో దశకు ముందు 55 నగరాలకు సర్వీసులు ఉండగా, ప్రస్తుతం 42 నగరాలకే పరిమితమయ్యాయి. Tags : మరిన్ని