ప్రధానాంశాలు TS News: హుజూరాబాద్లో ఈటలకే మొగ్గు.. కాంగ్రెస్కు వచ్చేది అక్కడ 5 శాతం ఓట్లే తేజ రాజు చేతిలో తెలంగాణ పాలన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆరోపణ ఈనాడు, దిల్లీ: కాంగ్రెస్కు పేరు వస్తుందనే భయంతోనే నల్గొండ జిల్లాలో తమ హయాంలో ప్రారంభించిన ఎస్సెల్బీసీ టన్నెల్, ఇతర ప్రాజెక్టుల పనులు పూర్తి చేయడం లేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెరాస ప్రభుత్వాన్ని ఆక్షేపించారు. దిల్లీలోని తెలంగాణ భవన్లో బుధవారం ఆయన విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. హుజూరాబాద్ శాసనసభ ఉప ఎన్నికకు సంబంధించి తాను సర్వే చేయించగా 67 శాతం ఓట్లు ఈటల రాజేందర్కు, 30 శాతం తెరాసకు పడేటట్లు ఉన్నాయని కోమటిరెడ్డి తెలిపారు. కాంగ్రెస్కు అయిదు శాతం లోపే వచ్చేలా ఉన్నాయని చెప్పారు. హుజూరాబాద్కు అభ్యర్థిని ప్రకటించి పార్టీ ప్రచారం, కార్యక్రమాలు వేగవంతం చేస్తే మార్పు వస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉందని, ఆ వ్యతిరేక ఓటు చీలకుండా కాంగ్రెస్ జాగ్రత్తపడాల్సి ఉందని పేర్కొన్నారు. నల్గొండ, భువనగిరి లోక్సభ పరిధిలోని అన్ని ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకోవడమే ప్రస్తుతం తన లక్ష్యమన్నారు. ప్రస్తుతం తెలంగాణలో పాలన అంతా మంత్రి కేటీఆర్ మిత్రుడు తేజ రాజు చేతిలో ఉందని వెంకట్రెడ్డి ఆరోపించారు. ఆర్థిక కుంభకోణాలకు పాల్పడి ఏడేళ్లు జైలులో ఉన్న సత్యం రామలింగరాజు కుమారుడే తేజ రాజు అని ఆయన తెలిపారు. Tags :