Live Breaking News & Updates on States central home ministry

Stay informed with the latest breaking news from States central home ministry on our comprehensive webpage. Get up-to-the-minute updates on local events, politics, business, entertainment, and more. Our dedicated team of journalists delivers timely and reliable news, ensuring you're always in the know. Discover firsthand accounts, expert analysis, and exclusive interviews, all in one convenient destination. Don't miss a beat — visit our webpage for real-time breaking news in States central home ministry and stay connected to the pulse of your community

సైబర్‌ నేరం.. ఇట్టే పట్టేస్తాం...


సైబర్‌ నేరం.. ఇట్టే పట్టేస్తాం...
నిందితుల కదలికలు.. ఫోన్‌ నంబర్ల సమాచారం
కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కొత్త వ్యవస్థ
తక్షణ ఫిర్యాదుతో పోయిన డబ్బు తిరిగి వెనక్కి
తెలంగాణలోని కేంద్రానికి నిత్యం 25-30 ఫిర్యాదులు
దేశవ్యాప్తంగా 2019లో 44,546 సైబర్‌ నేరాలు నమోదైతే వాటిలో 26,891 (60.4 శాతం) ఆర్థిక సంబంధ నేరాలే. తెలంగాణలోనూ మొత్తం 2,691 కేసుల్లో 2013 (70.4 శాతం) ఈ తరహావే. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ 24 గంటలు పనిచేసే హెల్ప్‌లైన్‌ నంబరు 155260ను అందుబాటులోకి తెచ్చింది.
ఈనాడు, హైదరాబాద్‌: నిత్యం సామాన్యుల నుంచి కార్పొరేట్‌ సంస్థల వరకు ఎందరినో మోసం చేస్తూ రూ.కోట్లు కొల్లగొడుతున్న సైబర్‌ నేరస్థుల ఆట కట్టించేందుకు.. సొమ్ము పోగొట్టుకున్న బాధితులకు సాంత్వన కలిగించేందుకు చర్యలు మొదలయ్యాయి. కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఐసీసీసీసీ (ఇండియన్‌ సైబర్‌ క్రైమ్‌ కోఆర్డినేషన్‌ కమిటీ) పేరుతో కొత్త వ్యవస్థ నేరగాళ్ల భరతం పడుతోంది. దేశంలోని 29 రాష్ట్రాలను భాగస్వాములుగా చేసిన హోంమంత్రిత్వ శాఖ అధికారులు.. వాటిని నాలుగు ప్రాంతీయ మండళ్లుగా వర్గీకరించారు. దిల్లీ, ముంబయి, కోల్‌కతాల నుంచి సైబర్‌ నేరస్థులు హైదరాబాదీలను మోసం చేసి నగదు బదిలీ చేసుకుంటే వారి సమాచారం ప్రాంతీయ మండళ్ల ద్వారా ‘ఐ ఫోర్‌-సీ’కి వెళ్తుంది. అక్కడి నుంచి దిల్లీ, ముంబయి, కోల్‌కతా పోలీసులు సమాచారం ఇస్తారు. దేశంలో సైబర్‌ నేరస్థులు ఎక్కడున్నా వీలైనంత త్వరగా వారిని అరెస్ట్‌ చేసేందుకు వీలుంటుంది. ఇలా రాజస్థాన్‌, బిహార్‌, మధ్యప్రదేశ్‌ పోలీసులు ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఇటీవలే నాలుగు ముఠాలను అరెస్ట్‌ చేసి జైలుకు తరలించారు. సైబర్‌ నేరాలు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాలకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ అధికారులు ప్రాంతీయ మండళ్లలో ప్రాధాన్యం కల్పించారు. దక్షిణాదిన హైదరాబాద్‌ కేంద్రంగా ప్రాంతీయ మండలి ఏర్పాటైంది. ఇందులో తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడు, కేరళతోపాటు మహారాష్ట్రకు స్థానం కల్పించారు. ఆయా రాష్ట్రాల సైబర్‌ క్రైమ్‌ విభాగాలు ఎప్పటికప్పుడు సమాచారాన్ని మార్చుకునేందుకు వీలుగా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ రూపొందించారు. బాధితులు చేయాల్సిందల్లా డబ్బు పోగొట్టుకున్నప్పుడు వీలైనంత తొందరగా ఫిర్యాదు చేయడమే.
వెంటనే అప్‌లోడ్‌
* బెంగళూరులో ఉంటున్న నైజీరియన్లు.. బిట్‌కాయిన్లు, కరోనా మందుల పేరుతో హైదరాబాద్‌, విజయవాడ, తిరుపతి, చెన్నైవాసులను మోసం చేస్తే.. కేసులు నమోదు చేసిన పోలీసులు నేరస్థులు వినియోగించిన సిమ్‌కార్డులు, నగదు బదిలీ చేసుకున్న బ్యాంక్‌ ఖాతాల వివరాలను వెంటనే సాఫ్ట్‌వేర్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. బెంగళూరులో ఉన్న పోలీసులు అప్రమత్తమై నేరస్థుల ఆచూకీ గుర్తించి హైదరాబాద్‌, విజయవాడ పోలీసులకు సమాచారం ఇస్తారు.
కొత్త నేరాలపై దృష్టి.. 
పెరుగుతున్న సైబర్‌ నేరాలను కట్టడి చేసేందుకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ 4 నెలల క్రితం ముఖ్యమైన రాష్ట్రాల పోలీస్‌ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించింది. బాధితులు ఒకచోట, నేరస్థులు అన్ని ప్రాంతాల్లో నేరాలు చేస్తున్నారని పోలీస్‌ అధికారులు ఈ సమావేశంలో తెలిపారు. ఏ రాష్ట్రంలో కేసులు నమోదైతే ఆ రాష్ట్రం పోలీసులు సైబర్‌ నేరస్థులను అరెస్ట్‌ చేస్తున్నారని, గతంలో ఎక్కడ ఎలాంటి నేరాలు చేస్తున్నారన్నది పట్టించుకోవడం లేదని వివరించారు. జైలుకు వెళ్లిన కొద్దిరోజులకే మళ్లీ నేరాలు చేస్తున్నారంటూ ఉదాహరణలతో పేర్కొన్నారు. వీటిని అరికట్టాలంటే సైబర్‌ నేరస్థుల అరెస్ట్‌ సమాచారాన్ని అన్ని రాష్ట్రాలకు, మెట్రో నగరాలకు పంపితే పోలీసులకు పట్టుబడిన నేరస్థులు మిగిలిన చోట్ల కూడా నేరాలు చేసుంటే ట్రాన్సిట్‌ వారెంట్‌ ద్వారా జైల్లో పెట్టొచ్చని వివరించారు. ఇలా రాష్ట్రాలు, నగరాల్లో జైళ్లకు తీసుకెళ్తుంటే కనీసం ఆరునెలలైనా నిందితులు జైల్లో ఉంటారు. ఆ సమయంలో పోలీసులు కొత్త నేరస్థులపై దృష్టి సారించి అరికట్టేందుకు వీలుంటుందని తెలిపారు. దీంతో దేశవ్యాప్తంగా సమన్వయ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ‘ఐ ఫోర్‌ సీ’ని కేంద్ర హోం మంత్రిత్వశాఖ ప్రవేశపెట్టింది.
ఇలా ఫోన్‌ చేస్తే.. అలా పట్టేస్తారు
దేశవ్యాప్తంగా సైబర్‌ నేరాల నుంచి బాధితులకు సాంత్వన కోసం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ 24 గంటలు పనిచేసే హెల్ప్‌లైన్‌ నంబరు 155260ను అందుబాటులోకి తెచ్చింది. ఉదాహరణకు తెలంగాణ నుంచి ఎవరైనా బాధితుడు ఈ నంబర్‌కు ఫోన్‌ చేస్తే యాంత్రికంగా అది హెల్ప్‌లైన్‌ కేంద్రానికి బదిలీ అవుతుంది. ప్రస్తుతం సైబరాబాద్‌ కమిషనరేట్‌లోని హెల్ప్‌లైన్‌కు రాష్ట్రవ్యాప్తంగా నిత్యం 25-30 ఫిర్యాదులు వస్తుంటాయి. అయితే బాధితులు డబ్బు పోగొట్టుకున్నప్పుడు వీలైనంత తొందరగా ఫిర్యాదు చేయాలి. కానీ ‘20 శాతం మంది మాత్రమే 24 గంటల్లోపు ఫిర్యాదు చేస్తున్నారు. వీలైనంత తొందరగా ఫిర్యాదు చేస్తేనే డబ్బు తిరిగి పొందే అవకాశముంటుంది..’ అని సైబర్‌ నేరాల దర్యాప్తు అధికారి ఒకరు తెలిపారు.
ఫిర్యాదుకు ఏ వివరాలు కావాలంటే..
బాధితులు 155260 నంబర్‌కు ఫోన్‌ చేసి వివరాలు తెలపొచ్చు. లేదంటే జాతీయ సైబర్‌క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌ www.cybercrime.gov.inకు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయొచ్చు. అవసరమైన వివరాలు చెప్పాక బాధితులకు సంక్షిప్త సందేశం లేదా మెయిల్‌ ద్వారా లాగిన్‌ ఐడీ/ అక్‌నాలెడ్జ్‌మెంట్‌ నంబరు వస్తుంది. దాని ఆధారంగా www.cybercrime.gov.inకు 24 గంటల్లోపు ఫిర్యాదు చేయాలి.
దిల్లీ కేంద్రంగా
* దిల్లీ కేంద్రంగా ఉత్తుత్తి ఉద్యోగాల పేరుతో మోసాలు చేస్తున్న సైబర్‌ నేరస్థులు హైదరాబాద్‌, బెంగళూరు విద్యార్థులు, నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. బహుళజాతి సంస్థలు, సాఫ్ట్‌వేర్‌ సంస్థల్లో ఉద్యోగాలిప్పిస్తామంటూ రూ.లక్షలు కొట్టేస్తున్నారు. నేరస్థులపై నమోదు చేసిన ఎఫ్‌.ఐ.ఆర్‌.లను ప్రాంతీయ మండలిలోని సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేస్తే దిల్లీ సైబర్‌ నేరస్థులు ఉపయోగించిన కంపెనీల పేర్లు, చిరునామాలను దిల్లీ పోలీసులు వీరికి అందజేయనున్నారు.
* మహారాష్ట్రలో సైబర్‌ నేరాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. రాజస్థాన్‌, బిహార్‌, ఝార్ఖండ్‌ రాష్ట్రాల్లో ఉంటున్న సైబర్‌ నేరస్థులు ముంబయి, పుణె, నాగపూర్‌ వాసులను క్రెడిట్‌ కార్డు, డెబిట్‌ కార్డు, నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాలతో మోసం చేస్తున్నారు. వీరిపై గురిపెట్టిన ముంబయి పోలీసులు అక్కడికి వెళ్లి సైబర్‌ ముఠాలను అరెస్ట్‌ చేస్తున్నారు. అనంతరం ఆ సమాచారాన్ని హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై పోలీసులకు మార్పిడి చేస్తున్నారు. సైబర్‌ ముఠాలు వినియోగించిన సిమ్‌ కార్డులు సరిపోలితే హైదరాబాద్‌ పోలీసులు అక్కడికి వెళ్లి నిందితులను తీసుకు వస్తున్నారు.
డబ్బు ఎలా తిరిగొస్తుందంటే..
సాధారణంగా బాధితుల నుంచి డబ్బు కాజేసే నేరస్థులు తొలుత వాటిని తమ వ్యాలెట్‌లోకి బదిలీ చేసుకుంటారు. అక్కడి నుంచి మరో ఖాతాకు మార్చి డ్రా చేస్తున్నారు. ఇందుకు ఒకట్రెండు రోజులు పడుతుంది. ఈలోపు గనక ఫిర్యాదు అందితే నేరస్థులు కొట్టేసిన డబ్బును వ్యాలెట్‌ లేదా బ్యాంకు ఖాతా నుంచి ఉపసంహరించకుండా ఆపే అవకాశముంది. హెల్ప్‌లైన్‌ లేదా పోర్టల్‌కు ఫిర్యాదు అందిన వెంటనే సంబంధిత పోలీస్‌ అధికారులు రంగంలోకి దిగుతారు. ఫిర్యాదులోని వివరాల ఆధారంగా బాధితుడు పోగొట్టుకున్న సొమ్ము ఏ వ్యాలెట్‌/ఖాతాకు బదిలీ అయిందో కనుక్కుంటారు. సంబంధిత బ్యాంకు/వ్యాలెట్‌ నిర్వాహకులకు సమాచారం అందించి డబ్బును డ్రా చేయకుండా ఆపుతారు. ఆ డబ్బును తిరిగి బాధితుల ఖాతాకు బదిలీ చేస్తారు.
Tags :

Dilli , Delhi , India , Nigeria , Mumbai , Maharashtra , United-states , Karnataka , Tirupati , Andhra-pradesh , Tamil-nadu , Pune