ప్రధానాంశాలు 4 రోజుల్లో రూ.600 తగ్గిన పసుపు ధర ఇక్కడి పంటలో తేమ ఎక్కువన్న విమర్శలు రాయితీపై శుద్ధి యంత్రాలు ఇవ్వాలని సుగంధ ద్రవ్యాల మండలి ప్రతిపాదన ఈనాడు, హైదరాబాద్: దేశంలో పసుపు పంటను అత్యధికంగా సాగుచేస్తుంది తెలంగాణ రైతులే. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ మార్కెట్లో రైతులకు దక్కుతున్న ధరలు మాత్రం సగానికి సగమే. మహారాష్ట్ర సాంగ్లీ మార్కెట్లో సోమవారం క్వింటా పసుపు గరిష్ఠ ధర రూ.14 వేలు పలికింది. నిజామాబాద్ మార్కెట్లో మాత్రం రూ.5 వేల నుంచి రూ.7,786 మధ్య కొనుగోళ్లు జరిగాయి. గత నాలుగు రోజుల్లోనే ఇక్కడ క్వింటా గరిష్ఠ ధర రూ.600 తగ్గింది. రూ.8,300 నుంచి రూ.7,786కి పడిపోయింది. తెలంగాణలో మార్కెట్లకు వచ్చే పంటలో తేమశాతం ఎక్కువుంటోందని, దీంతో ధర రావడం లేదని నిజామాబాద్లోని ‘భారత సుగంధ ద్రవ్యాల మండలి’ చెబుతోంది. ఈ సమస్యను అధిగమించడానికి పసుపు కొమ్ములను ఉడకబెట్టి, శుద్ధి చేసే యంత్రాలను రైతులకు రాయితీపై ఇవ్వాలని నిర్ణయించింది. విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ సదుపాయాలకు రూ.90.97 కోట్లు, రాయితీలకు రూ.2.50 కోట్లు ఇవ్వాలని తాజాగా కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ధర లేక తగ్గిన పంట గతేడాది జూన్లో నిజామాబాద్ మార్కెట్కు లక్షా 19 వేల క్వింటాళ్లు రాగా.. ఈ ఏడాది ఈ నెల సగం పూర్తయినా ఇప్పటికి వచ్చింది 20 వేల క్వింటాళ్లు మాత్రమే. రాష్ట్రంలో రెండేళ్లుగా సరైన ధర లేక పసుపు సాగు విస్తీర్ణం తగ్గిందని ఉద్యానశాఖ సంచాలకుడు వెంకట్రామ్రెడ్డి ‘ఈనాడు’కు చెప్పారు. Tags :