Updated : 04/07/2021 14:26 IST CM KCR: సిరిసిల్లలో కేసీఆర్ పర్యటన సిరిసిల్ల: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో భాగంగా తొలుత మండేపల్లిలో రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభించారు. ఇక్కడ గేటెడ్ కమ్యునిటి తరహాలో రూ.83.37 కోట్లతో 27 ఎకరాల్లో మొత్తం 1,320 రెండు పడక గదుల ఇళ్లను నిర్మించారు. ఈ సందర్భంగా కేసీఆర్ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి.. లబ్ధిదారుల గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్, ట్రైనింగ్ రీసెర్చ్ కేంద్రంతో పాటు మండేపల్లిలో నిర్మించిన ఐడీటీఆర్ శిక్షణ కేంద్రాన్ని కూడా కేసీఆర్ ప్రారంభించారు. 20 ఎకరాల స్థలంలో రూ.16.48 కోట్లతో ఈ ఐడీటీఆర్ను నిర్మించారు. ఈ కేంద్రంలో నెలకు 400 మందికి పైగా శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. పర్యటనలో భాగంగా సీఎం సిరిసిల్లలో నర్సింగ్ కళాశాలను ప్రారంభించారు. రూ.36.45 కోట్లతో 5 ఎకరాల్లో నర్సింగ్ కాలేజీని ఏర్పాటు చేశారు. అధునాతన హంగులతో నర్సింగ్ కళాశాల, వసతి గృహాలను నిర్మించారు. దీంతో పాటు సిరిసిల్ల మార్కెట్ కమిటీ సముదాయం, గిడ్డంగులను కేసీఆర్ ప్రారంభించారు. సర్దాపూర్ మార్కెట్ యార్డుకు శ్రీకారం చుట్టారు. ఇక్కడ రైతుల కోసం సకల వసతులతో మార్కెట్ యార్డు ఏర్పాటు చేశారు. రూ.20 కోట్లతో 20 ఎకరాల్లో యార్డును నిర్మించారు. అనంతరం సిరిసిల్ల జిల్లా సమీకృత కలెక్టరేట్ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. సకల సౌకర్యాలతో రూ.64.70 కోట్లతో 93.33 ఎకరాల్లో భవనాన్ని నిర్మించారు. ఇవీ చదవండి