కార్పొరేట్ స్థాయిలో బడుల అభివృద్ధి మంత్రి టి.హరీశ్రావు సిద్దిపేట టౌన్, న్యూస్టుడే: తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని, వచ్చే రెండేళ్లలో రూ.4 వేల కోట్లతో కార్పొరేట్ స్థాయిలో బడులను అన్ని వసతులతో అభివృద్ధి చేస్తామని రాష్ట్ర మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. సిద్దిపేటలోని ఇందిరానగర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో తమ పిల్లలకు సీట్లు ఇప్పించాలంటూ తల్లిదండ్రులు తనను కోరుతున్నారని, ఆ పరిస్థితి అన్ని ప్రభుత్వ పాఠశాలలకు రావాలన్నదే తన సంకల్పమన్నారు. హైదరాబాద్కు చెందిన ఈ-ప్యామ్ సంస్థ ఆర్థిక సహకారంతో నిర్మాణ్ స్వచ్ఛంద సంస్థ నేతృత్వంలో ఇందిరానగర్ పాఠశాలలో రూ.20 లక్షలతో ఏర్పాటుచేసిన కంప్యూటర్ ల్యాబ్ను ఆదివారం మంత్రి ప్రారంభించారు. విద్యార్థులు రూపొందించిన యానిమేషన్ అంశం గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతోందని వివరించారు. ఇక్కడి ప్రభుత్వ బడిలో సీటు కోసం కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు వరుస కడుతున్నారన్నారు. హెచ్ఎం రామస్వామి, ఉపాధ్యాయులను ప్రశంసించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, ఈ-ప్యామ్, నిర్మాణ్ సంస్థల డైరెక్టర్లు శాంతికుమార్, వహీద్ తదితరులు పాల్గొన్నారు. Tags :