అస్సాం-మిజోరం సరిహద్దు భగ్గు మిజోరం అల్లరి మూకల కాల్పుల్లో ఆరుగురు అస్సాం పోలీసుల మృతి రెండు రాష్ట్రాల సీఎంలతో మాట్లాడిన అమిత్ షా గువాహటి, ఈనాడు: ప్రకృతి అందాలకు నిలయమైన ఈశాన్య భారతంలో రాష్ట్రాల సరిహద్దు వివాదం సోమవారం భగ్గుమంది. అస్సాం-మేఘాలయ సరిహద్దులోని కచార్ జిల్లాలో చిన్నగా మొదలైన ఘర్షణలు చినికిచినికి గాలివానలా మారి ఏకంగా ఆరుగురు పోలీసుల ప్రాణాలను బలిగొన్నాయి. ఓ ఎస్పీ సహా 60 మందికి పైగా గాయపడ్డారు. ఇరువైపులా ఆస్తులు, వాహనాలు ధ్వంసమయ్యాయి. గతేడాది ఆగస్టులో, ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ సరిహద్దు సమస్యపై ఘర్షణలు జరిగాయి. అవి పునరావృతమయ్యాయి. సరిహద్దులోని 8 వ్యవసాయ పాకలను గుర్తుతెలియని వ్యక్తులు తగలబెట్టడమే తాజా ఘర్షణలకు కారణంగా కనిపిస్తోంది. సరిహద్దు సమస్యపై కేంద్ర హోంమంత్రి అమిత్షా చర్చలు జరిపి వెళ్లిన మరుసటి రోజే ఈ ఘర్షణలు చోటుచేసుకోవడం గమనార్హం. పరస్పరం ఆరోపణలు కచార్ జిల్లాలో మేఘాలయ వైపు నుంచి అల్లరిమూకలు జరిపిన కాల్పుల్లో రాష్ట్ర పోలీసులు ఆరుగురు మృతి చెందారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తెలిపారు. పొరుగు రాష్ట్రం వైపు నుంచి చోటుచేసుకున్న కాల్పులు, రాళ్లు రువ్విన ఘటనల్లో కచార్ జిల్లా ఎస్పీ నింబాల్కర్ వైభవ్ చంద్రకాంత్ సహా 50 మంది సిబ్బంది గాయపడినట్లు అస్సాం పోలీసు విభాగానికి చెందిన అధికారి ఒకరు చెప్పారు. రెండు రాష్ట్రాల అధికారులు సరిహద్దు అంశంపై చర్చలు జరుపుతుండగా అల్లరిమూకలు ఒక్కసారిగా కాల్పులు ప్రారంభించాయని తెలిపారు. కచార్ ఎస్పీ నింబాల్కర్ తొడ భాగంలోకి తూటా దూసుకెళ్లిందని, ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని వైద్యుడు ఒకరు తెలిపారు. మరోవైపు ఈ ఉద్రిక్తతలకు కారణం అస్సాం పోలీసులేనని మిజోరం ఆరోపించింది. కారణం అదేనా? సరిహద్దులో ఆక్రమణలపై అస్సాం, మిజోరంలు చాన్నాళ్లుగా ఘర్షణ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అయిత్లాంగ్ సెలయేరు సమీపంలో రైతులకు చెందిన 8 వ్యవసాయ పాకలకు ఆదివారం ఉదయం 11.30 గంటలకు దుండగులు నిప్పుబెట్టారని మిజోరం డీఐజీ లాల్బియాకాంగ ఖియాంగ్టే చెప్పారు. ఈ పాకలన్నీ సరిహద్దులో అస్సాం వైపున్న వైరెంగ్టేకి చెందిన రైతులవని వెల్లడించారు. ఈ ఘటనే తాజా ఘర్షణలకు కారణమని భావిస్తున్నారు. సీఎంల మాటల యుద్ధం కచార్ సరిహద్దులో పోలీసులతో ప్రజలు ఘర్షణ పడుతున్న వీడియోను మిజోరం ముఖ్యమంత్రి జొరాంథాంగా సోమవారం మధ్యాహ్నం ట్విటర్లో ఉంచారు. దీనిపై దృష్టి సారించాలని అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. ‘మిజోరం-అస్సాం సరిహద్దు ఉద్రిక్తత’గా పేర్కొన్న ఈ ట్వీట్కు ప్రధాని, హోంమంత్రి కార్యాలయాలు, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, అస్సాంలోని కచార్ జిల్లా కలెక్టర్, కచార్ పోలీసులను ట్యాగ్ చేసి తక్షణం దీనిని ఆపాలని కోరారు. కారులో కచార్ మీదుగా మిజోరం వస్తున్న దంపతులపై గూండాలు, దొంగలు దాడి చేశారంటూ అందుకు సంబంధించిన దృశ్యాలున్న వీడియోతో మరో ట్వీట్ చేశారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ స్పందిస్తూ.. లైలాపుర్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఘర్షణలు, కాల్పులపై మిజోరం ముఖ్యమంత్రి జొరాంథాంగా కల్పించుకోవాలని కోరారు. శాంతిని పునరుద్ధరించండి: కేంద్రం కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, మిజోరం ముఖ్యమంత్రి జొరాంథాంగాలతో ఫోన్లో మాట్లాడారు. వివాదానికి పరస్పర అంగీకారంతో శాంతియుత పరిష్కారం లభించేలా చూడాలని కోరారు. Tags :