వెయ్యిమంది దంపతుల తారక మంత్రం శ్రమయేవ జయతే! భార్య భర్త ఒకే కార్యాలయంలో పనిచేయడం మనం చూస్తుంటాం! అదే కార్యాలయమంతా భార్యభర్తలే పనిచేస్తుంటే...నెల్లూరుజిల్లాలోని అపాచీ సంస్థ దంపతులకు కలిసి పనిచేసే అవకాశాన్ని ఇస్తోంది. అటువంటి అవకాశాన్ని వాడుకుని వెయ్యిమంది మహిళలు తమ కుటుంబాలకు ఇరుసుగా మారిన కథ ఇది... సాధారణంగా ఒకే శాఖలో కొలువులు సాధించిన భార్యభర్తలను చూసుంటాం.. కానీ ఒకే కార్యాలయంలో పనిచేసే దంపతులను తక్కువగానే చూస్తాం. కానీ ఇలా కొన్ని వందల జంటలు ఒకే చోట కొలువుతీరడం మాత్రం చూసుండం. ‘ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపూసొలుపేమున్నదీ’ అని పాడుకుంటూ కలిసిమెలిసి పనిచేసే భార్యభర్తల్ని చూడాలంటే మాత్రం తడ మండలం మాంబట్టు సెజ్లో ఉన్న అపాచీ బూట్ల తయారీ పరిశ్రమలో అడుగుపెట్టాల్సిందే. తడ మండలంలో ఈ విదేశీ పరిశ్రమ 2006లో కొలువు దీరింది. భర్త ఒక చోట, భార్య మరో చోట కాకుండా ఇద్దరూ ఉపాధి పొందే అవకాశం కల్పించిందీ సంస్థ. దాంతో నాడు కూలీలుగా జీవనం భారంగా నెట్టుకొచ్చిన కొందరు, నేడు ఉద్యోగులుగా చేరి నెలవారీజీతం పొందుతున్నారు. పురుషులతో సమానంగా మహిళలకు కూడా ఉపాధి దొరకడంతో చాలీచాలని వేతనాలతో నలిగిపోయిన వారి జీవితాల్లో వెలుగులు తొంగిచూశాయి. పట్టణాలకు ఏమాత్రం తీసిపోని విధంగా పల్లెల్లోనూ పక్కా ఇళ్లు వెలుస్తున్నాయి. పిల్లల్ని కార్పొరేటు పాఠశాలల్లో చేర్పించి మెరుగైన విద్య అందిస్తున్నారు. భార్యాభర్తలిద్దరూ జంటగా వెళ్లి విధులు ముగించుకుని ఆఫీసు బస్సుల్లోనే క్షేమంగా ఇంటికి చేరుతున్నారు. అటు ఉపాధి, ఇటు భద్రత ఉండడంతో కార్మికులు నిశ్చింతగా ఉంటున్నారు. పరిశ్రమలో దంపతులు ఒకరినొకరు చేర్పించుకునే అవకాశం కూడా ఇక్కడ ఉంది. ముందుగా భర్త కార్మికుడిగా పనిచేస్తుంటే.. పెళ్లయ్యాక భార్యను చేర్పించుకోవచ్చన్నమాట. ఇలా దంపతుల సంఖ్య ఈపరిశ్రమలో ఎక్కడా లేని విధంగా అంతకంతకూ పెరుగుతూపోతోంది. ఈ పరిణామం మాకు ఆనందదాయకమేనని యాజమాన్యం చెబుతోంది. బేల్దారి పని నుంచి... దయాకర్, రాజేశ్వరి దంపతులది మన్నారు పోలూరు ప్రాంతం. అపాచీలో చేరక ముందు బేల్దారి కూలీ పనులకు వెళ్లే వాడు దయాకర్. ఒక రోజు పని ఉంటే మరో రోజు ఉండేది కాదు. తొలుత తాను పరిశ్రమలో చేరాడు. పెళ్లయ్యాక భార్యను కూడా పరిశ్రమలో చేర్పించాడు. పదేళ్లుగా ఇద్దరూ పరిశ్రమలో పనిచేస్తున్నారు. ఒకరి జీతం ఇంటి అవసరాలకు సరిపోగా రెండో జీతం మిగులుతోంది. పరిశ్రమలో చేరాక ఇద్దరికీ కలిపి రూ.40వేలు దాకా జీతం వస్తోంది. ఓ యాక్సిడెంట్లో దయాకర్ కాలు విరిగి ఆసుపత్రి పాలయినా... ఇంటిని ఎటువంటి ఇబ్బంది లేకుండా నడిపిస్తున్నాడంటే కారణం అతని భార్య రాజేశ్వరి జీతమే. * అక్కంపేటకు చెందిన వెంకటరమణయ్య, అరుణ దంపతులది నిరుపేద కుటుంబం. వెంకటరమణయ్య రోజు కూలీగా పనిచేసేవాడు. కుటుంబ అవసరాలకు చాలా అప్పులు చేశాడు. అపాచీలో చేరిన తర్వాత వాళ్ల జీవితాల్లో వెలుగులు పూయడం మొదలయ్యింది. 15 ఏళ్లుగా భార్యభర్తలిద్దరూ కలిసి పనిచేస్తున్నారు. రమణకి అరుణ జీతం కూడా తోడైన తర్వాత వాళ్ల పిల్లల్ని ఇంగ్లీషు మీడియం పాఠశాలలో చదివిస్తున్నారు. కొత్త ఇల్లు కట్టుకున్నారు. ‘ఒక్క జీతంతో ఇవన్నీ సాధ్యమవ్యేవి కావు. అరుణ జీతం వల్లే మా జీవితాల్లో కొత్త వెలుగులు పూస్తున్నాయి’ అంటున్నాడు వెంకటరమణయ్య. ఇలాంటి జీవితాలు ఇక్కడ ఎన్నో కనిపిస్తాయి. - చిల్లకూరు చంద్రమోహన్రెడ్డి, తడ Tags :