మిస్సైల్ పాఠాలు నేర్పింది కలాం! నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ‘ఓ అమ్మాయి శాస్త్రవేత్త అవడమా!’ అని ఆశ్చర్యపోయే రోజుల్లోనే డీఆర్డీవోలో అడుగు పెట్టారామె! డాక్టర్ ఏపీజేఅబ్దుల్కలాం ఆ సంస్థకు డైరెక్టర్గా ఉన్న రోజులవి.. స్వయంగా ఆయనిచ్చిన ధైర్యంతోనే అగ్ని, పృథ్వి వంటి క్షిపణి పరిశోధనల్లో పాల్గొన్నారు.. ఆ స్ఫూర్తినే కొనసాగిస్తూ... కొత్తగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ల్యాబ్లో శాటిలైట్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా బాధ్యతలు తీసుకున్నారు తెలుగింటి ఆడపడుచు రాణీ సురేందర్... రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) తన అవసరాల కోసం కొత్తగా ఉపగ్రహాలపై పరిశోధనలు మొదలుపెట్టింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక ల్యాబ్ ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్ట్కు తెలుగు మహిళా శాస్త్రవేత్త రాణి సురేందర్కు డైరెక్టర్గా బాధ్యతలు అప్పగించింది. ఆమె తన ప్రస్థానం ఇలా వివరించారు. ‘మా స్వస్థలం గుడివాడ దగ్గర కుదరవల్లి. నేను పుట్టింది మాత్రం హైదరాబాద్లోనే. నాన్న కేఆర్కే మూర్తి హెచ్ఎంటీలో ఇంజినీర్ కావడంతో నేనూ ఆ రంగంపైనే ఆసక్తి పెంచుకున్నా. విజయవాడలో ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్స్లో బీటెక్ పూర్తిచేశా. మా అమ్మ పెద్దగా చదువుకోలేదు కానీ పిల్లలు బాగా చదువుకోవాలని పట్టుదలగా ఉండేది. ఆమె ఇచ్చిన ప్రోత్సాహంతోనే నేను డీఆర్డీవోలాంటి ప్రతిష్ఠాత్మక సంస్థలో అడుగుపెట్టాననిపిస్తుంది. మొదట్లో డీఆర్డీవో తనకు కావాల్సిన శాస్త్రవేత్తలని తయారుచేసుకునేందుకు కొన్ని కోర్సులు నిర్వహించేది. అలా నేను గైడెడ్ మిస్సైల్స్ కోర్సు చదివి.. 1987లో శాస్త్రవేత్తగా చేరా. అప్పుడు మా డైరెక్టర్ అబ్దుల్ కలాం. అక్కడ చేరిన వెంటనే ఆయనను కలుసుకోవడానికి వెళ్లా. అదే మొదటిసారి ఆయనను చూడటం. ఎంటెక్లో నేను చేసింది ప్రాజెక్ట్ కంట్రోల్ సిస్టమ్స్ కావడంతో ‘ఈ పనికి నువ్వు సరిగ్గా సరిపోతావు’ అని అన్నారు. నాతో మాట్లాడిన అరగంటలో... ఎన్నో విషయాలు చెప్పారు. అది మొదలు రెండేళ్లపాటు ఆయనతో కలిసి పనిచేశాను. ఆయనిచ్చిన ప్రోత్సాహం వల్లే నాలో ఉన్న ఎన్నో భయాలు తొలగిపోయాయి. మిసైల్స్ తయారీ కోసం అప్పటివరకు మన దేశంలో ఒకే ల్యాబ్ ఉండేది. కానీ కలాంగారి చొరవతో ఆర్సీఐ(రీసెర్చ్ సెంటర్ ఇమారత్) ఏర్పాటు అయ్యింది. 1989 నుంచి ఆ ల్యాబ్లోనే క్షిపణుల కమ్యూనికేషన్కు సంబంధించి వాడే సీకర్స్పై పరిశోధనలు మొదలుపెట్టా. కలాం నేతృత్వంలోని అగ్ని, పృథ్వి వంటి క్షిపణి పరిశోధనల్లో పాలుపంచుకునే అవకాశం వచ్చింది నాకు.’ అంటారు రాణి. ఆ మిస్సైల్ నా విజయం... ‘క్షిపణి కోసం పనిచేయడం అంటే మాటలు కాదు. ఏ చిన్నపొరపాటు జరిగినా... దాన్ని సరిచేయడానికి వారాలు.. నెలలు కూడా పడుతుంది. ఇందుకోసం సమయం చూసుకుని పనిచేయలేం. కానీ దేశం కోసం చేసే ఈ పని ఎంతో సంతృప్తినిస్తుంది’ అని అంటారామె. ‘ఒక క్షిపణిలో ఎన్నో ఉప వ్యవస్థలు ఉంటాయి. వాటన్నింటిపైనా అవగాహన ఉన్నప్పుడే మన పని తేలిక అవుతుంది. శాస్త్రవేత్తగా చేరిన మొదట్లో కష్టం అనిపించినా క్రమంగా అన్నీ తెలుసుకుంటూ ముందడుగు వేశా. ఏదైనా సమస్య తలెత్తితే ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకునేందుకు, దాన్ని సరిదిద్దేందుకు వారం నుంచి రెండు నెలల సమయం పట్టేది. అలాంటప్పుడు రాత్రీపగలు పనిచేయాల్సి వచ్చేది. నా కెరీర్లో రెండు మిసైల్స్ కోసం పనిచేశా. 2011లో ‘మిల్లీ మెట్రిక్ వేవ్’ సీకర్ సిస్టమ్లో పనిచేయడం నా జీవితంలో సాధించిన పెద్ద విజయం. కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న వస్తువులను ఎలాంటి వాతావరణంలోనైనా గుర్తించి ఛేదించగలిగే సామర్థ్యం దీనికుంది.’ అంటూ కెరీర్లో తనకెదురయిన సవాళ్లని వివరించారు. బాబుని అత్తగారికి అప్పగించి... ‘నెలలు తరబడి కష్టపడి పనిచేసిన తర్వాత మిసైల్స్ని పరీక్షించేందుకు ఒడిశాలోని బాలాసోర్ వెళ్లి అక్కడే కొన్ని రోజులు గడపాల్సి వచ్చేది. నేను ఉద్యోగంలో చేరిన మూడునాలుగు నెలల వ్యవధిలోనే ఇంజినీర్ సురేందర్తో పెళ్లైంది. రెండేళ్లకే బాబు పుట్టాడు. వాడిని మా అత్తగారికి అప్పగించి మిస్సైల్ పరీక్షల కోసం వెళ్లేదాన్ని. మిసైల్ లాంచ్ చేయడం నుంచి ఆ తర్వాత లక్ష్యాన్ని చేరిందా లేదా అని పరీక్షించడం వరకు ఎన్నో పనులుంటాయి. ఇందుకోసం ఒక్కోసారి నెలరోజులు కూడా అక్కడే ఉండిపోవాలి. కుటుంబ సహకారం లేకపోతే ఇవన్నీ చేయగలిగేదాన్ని కాదేమో’ అంటారు రాణి. అవకాశాలు ఉన్నాయ్.. ‘మహిళలకు డీఆర్డీవోలో చాలా అవకాశాలున్నాయి. ఇక్కడ పురుషులు, స్త్రీలు అనే వివక్ష ఎప్పుడూ లేదు. ప్రారంభంతో పోలిస్తే ఇప్పడు మహిళా శాస్త్రవేత్తల సంఖ్య బాగా పెరిగింది. కొత్తగా యువ శాస్త్రవేత్తల కోసం ల్యాబ్లు కూడా ఏర్పాటు అయ్యాయి. క్షిపణులు, యుద్ధ ట్యాంకుల రూపకల్పనతో పాటూ ... ఉపగ్రహాలు, కృత్రిమ మేధ], క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి వేర్వేరు అంశాలపై డీఆర్డీవో పనిచేస్తోంది. రక్షణ రంగంలో అంకుర సంస్థలు ఎన్నో వస్తున్నాయి. అవకాశం వచ్చినప్పుడు సవాళ్లను స్వీకరించి మహిళలు తమ శక్తి సామర్థ్యాలను చూపాలి. మహిళలు సైతం అన్నీ చేయగలరని నిరూపించాలి... ఇదీ రాణి అంతరంగం. - మల్లేపల్లి రమేష్ రెడ్డి, హైదరాబాద్ Tags :