Live Breaking News & Updates on Cooking tips in telugu
Stay updated with breaking news from Cooking tips in telugu. Get real-time updates on events, politics, business, and more. Visit us for reliable news and exclusive interviews.
ఫేస్బుక్లో వచ్చిన ఓ పోస్ట్ ఆమెను కదిలించింది... ఓ వ్యక్తి రెండు చేతులూ జోడించి ‘ఆకలితో ఉన్నా.. ఆదుకోండి’ అంటూ ఉన్న ఆ పోస్టు గురించి ఆరా తీసింది. అదో నృత్యకళాకారుడిది. దాంతో ఒక్కసారిగా దుఃఖం తన్నుకొచ్చిందామెకు. ఎందుకంటే ఆమె కూడా ఓ నృత్యకళాకారిణే. ఆ క్షణంలో ఆమెకొచ్చిన ఆలోచన ఆ ఫొటోలో ఉన్న వ్యక్తికే కాదు.. అటువంటి వందలాదిమంది కళాకారుల కడుపు నింపింది 37 ఏళ్ల డాక్టర్ భావన. ‘సేవ్ కూచిపూడి ఆర్టిస్ట్’ పిలుపుతో కళాకారులకు భరోసా ఇస్తున్న ఆమె తన గురించి తెలిపారిలా... మాది విజయవాడ. చిన్నప్పుడు నేను బరువు తగ్గాలని అమ్మ నన్ను నృత్యంలో చేర్పించింది. కారణమేదైనా నాకు మాత్రం నృత్యం అంటే ప్రాణంగా మారింది. అందుకే జీవీఆర్ మ్యూజిక్ ¥లేజీలో డిప్లొమా చేశా. ఆ తర్వాత కూచిపూడి కళాక్షేత్రలో ఎమ్ఏ డ్యాన్స్ పూర్తి చేశా. పెళ్లైన తర్వాత హైదరాబాద్ వచ్చా. కూచిపూడి నృత్యప్రదర్శనలిస్తూ, సొంతంగా ‘శారదా కళాక్షేత్ర డాన్స్ అకాడమీ’ స్థాపించి 150 మంది విద్యార్థులకు కూచిపూడిలో శిక్షణనిస్తున్నా. రోడ్డున పడి... ఫేస్బుక్లో మా రంగంలో ఉన్నవారందరికీ ఓ గ్రూప్ ఉంది. గతేడాది మార్చి మొదటివారంలో అందులో ఓ పోస్ట్ను చూశా. ఓ నృత్యకళాకారుడి ఆవేదన అది. ఆ ఫొటోను చూసినప్పుడు కన్నీళ్లు ఆగలేదు. కడుపులో మెలిపెట్టినట్లు అయ్యింది. ఆయన చిత్తూరుకు చెందిన ఓ కూచిపూడి కళాకారుడు. కొవిడ్ కారణంగా ఆ కుటుంబం రోడ్డున పడింది. ఆ రోజంతా ఆయన నా కళ్లెదుటే ఉన్నట్లనిపించింది. ఏదో ఒకటి చేయాలని ఆలోచించా. వెంటనే తెలిసిన వారందరినీ సంప్రదించా. ఇలా మరెందరో కళాకారులు ఆకలితో అలమటిస్తూ ఉంటారు కదా.. అటువంటి వారందరినీ ఆదుకోవాలనిపించింది. ‘సేవ్ కూచిపూడి ఆర్టిస్ట్’... కూచిపూడి శిక్షణా పథకం కింద దాదాపు 400 మంది కళాకారులకు గతంలో ఉద్యో గాలుండేవి. అయితే ప్రభుత్వం మారినప్పుడు ఉపాధి కోల్పోయారు. తర్వాత వారంతా ఓ బృందంగా ఏర్పడ్డారు. ఆ గ్రూపును సంప్రదించా. లాక్డౌన్ కారణంగా ఆర్థికంగా చితికిపోయిన కళాకారులందరికీ చేయూతనివ్వడానికి నా ఆర్థిక స్తోమత సరిపోకపోవడంతో ఓ ఆలోచన వచ్చింది. ‘సేవ్ కూచిపూడి ఆర్టిస్ట్’ పేరుతో ఫేస్బుక్ పేజీ ద్వారా ఒక లైవ్ ప్రోగ్రాం ప్రారంభించా. ఇందులో రోజుకొక కళాకారుడితో వారి కష్టాలను చెప్పించేదాన్ని. ప్రభుత్వం చేయుత´తనివ్వాలని కోరేదాన్ని. రెండుమూడు గంటలపాటు జరిగే ఆ కార్యక్రమం సోషల్మీడియాలో చాలా స్పందనను తెచ్చింది. లైవ్ మొదలైన రెండో రోజునే కూచిపూడి కళాకారుడు వెంపటి వెంకట్ స్పందించారు. ఆ తర్వాత మరెందరో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ఆర్థికంగా చేయూతనందించడానికి చాలామంది ముందుకొచ్చారు. ఆ నగదుని ఓ ట్రస్టు ద్వారా సేకరించాం. మరోవైపు దయనీయ స్థితిలో ఉన్న నృత్యకళాకాలందరినీ గుర్తించడానికి జిల్లాలన్నింటిలో వాలంటీర్లుగా పనిచేయడానికి కొందరు ముందుకొచ్చారు. ఇలా ఆంధ్రలో 600, తెలంగాణలో 800 మంది కళాకారులను గుర్తించి అందరికీ తక్షణసహాయంగా తలా రూ.1000 చొప్పున ముందుగా అందించాం. హైదరాబాద్, మెదక్ ప్రాంతాల్లో ఉండేవారికి నిత్యావసర వస్తువులనూ పంపిణీ చేశాం. అలా నాలుగునెలలపాటు పేద కళాకారులకు సాయం అందేలా కృషి చేశా. దేశంలోనే కాదు.. అమెరికా, లండన్ దేశాల నుంచి కూడా పలువురు కళాకారులు తమ వంతు చేయూతనందించారు. ఒక్కొక్కరు రూ.500 పంపితే, మరొకరు రూ. లక్ష కూడా ఇచ్చారు. ఆ నాలుగునెలలూ ఓ కార్పొరేట్ సంస్థ సిబ్బందిలా పని చేశాం. వృద్ధులకు ఆసుపత్రి ఖర్చులు తలా అయిదువేలు పంపించేవాళ్లం. మొత్తం రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలు ఆర్థికసాయంతోపాటు నిత్యావసర వస్తువులనూ పంపిణీ చేశాం. పింఛను ఇప్పించి... లాక్డౌన్ తర్వాత కళాకారులకు ఉపాధి దొరకడం కష్టమైంది. దాంతో పలు కార్పొరేట్ సంస్థల సహాయం తీసుకుంటున్నాం. ఆలయాల్లో కళాకారుల నృత్యప్రదర్శన ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాం. ఇటీవల జేఎస్పీఎల్ సంస్థ ద్వారా 12 మంది వృద్ధకళాకారులకు వారి జీవితాంతం తలా రెండున్నరవేల రూపాయలు నెలనెలా పింఛను అందేలా చేశా. దానికి కన్నీళ్లతో వారు చెప్పే కృతజ్ఞతలు నాపై మరింత బాధ్యతను పెంచాయి. త్వరలో అంతర్జాతీయ కూచిపూడి సమాఖ్యను ప్రారంభించనున్నా. ఇందులో ప్రతి కళాకారుడు సభ్యుడిగా చేరొచ్చు. వెంపటి చినసత్యంగారి జ్ఞాపకార్థం ఏటా అక్టోబరు 15న ‘వరల్డ్ కూచిపూడి డే’గా జరుపుకోవడం గతేడాది నుంచి ప్రారంభించాం. Tags :
డెబ్భైఏడేళ్ల వయసులోనూ అదే ఉత్సాహం! గ్యాస్ సిలెండర్ త్వరగా అయిపోతే ఈసారైనా జాగ్రత్తగా వాడి ఖర్చులను కాస్త తగ్గించుకోవాలనుకుంటాం. కానీ విమల్డిగే మాత్రం సిలెండర్తో పనిలేకుండానే పదహారేళ్లుగా వంట చేస్తూ పొదుపు చేస్తున్నారు. పుణెకు చెందిన విమల్ ఓరోజు టీవీలో వంటింటి వ్యర్థాలతో బయోగ్యాస్ తయారీ గురించి ప్రత్యేక కార్యక్రమాన్ని చూశారు. పర్యావరణ హితానికి తోడ్పడే పనులను చేయడంలో ఆమె ఎప్పుడూ ముందుంటారు. కూరగాయలు, పండ్లు, బియ్యం కడిగిన నీళ్లను పెరట్లోని మొక్కలకు పోసేవారు. నెలవారీ సరుకులు కొనాలన్నా కాటన్ బ్యాగునే తీసుకెళ్లేవారు. అదే స్ఫూర్తితో ఆమె ఇంట్లోనూ బయోగ్యాస్ ప్లాంటును ఏర్పాటుచేయాలని ఆలోచించారు. దీన్ని కొడుకుతో పంచుకుని పుణెలోని రూరల్ టెక్నాలజీ సంస్థను సంప్రదించి తమ మేడ మీద బయోగ్యాస్ ప్లాంట్ను ఏర్పాటు చేసుకున్నారు. అప్పటినుంచీ వంటకు ఈ గ్యాస్నే వాడటంతో వారి కుటుంబానికి గ్యాస్ సిలెండర్తో పనిలేకుండా లేకుండా పోయింది. ఎలా పనిచేస్తుందంటే... ఈ బయోగ్లాస్ యూనిట్లో రెండు నీటి ట్యాంకులు ఉంటాయి. కింది దాని సామర్థ్యం వెయ్యి లీటర్లు ఉంటుంది. పైట్యాంకు దీనికంటే చిన్నగా ఉంటుంది. దీంట్లో నిల్వ ఉండే బయోగ్యాస్ పైప్లైన్ ద్వారా వంటింట్లోకి సరఫరా అవుతుంది. రెండు ట్యాంకులకూ ఉండే పైపుల్లో వ్యర్థాలను వేయొచ్చు. కూరగాయల ముక్కలు, టీపొడి, మిగిలిన ఆహార పదార్థాలు లాంటి వాటిని ఇందులో వేశారు. ఇవి వేసిన తర్వాత నాలుగు లీటర్ల నీళ్లు పోసి ఆవు పేడతో నింపారు. మూడు వారాల్లోనే గ్యాస్ సిద్ధమైంది. ఇది పదహారేళ్లుగా ఎలాంటి రిపేరూ లేకుండా పనిచేస్తోంది. పెద్దలే కాకుండా పిల్లలూ ఆహార వ్యర్థాలను సులువుగా దీంట్లో వేయొచ్చు. మనుమరాలు శ్రేయాకు ఏడేళ్లు ఉన్నప్పుడు ఈ బయోగ్యాస్ను ఏర్పాటుచేశారు. ‘నా చిన్నతనంలో నాన్నమ్మ చొరవతోనే ఇంట్లో బయోగ్యాస్ ప్లాంటును ఏర్పాటుచేశారు. ఈ వయసులోనూ నాన్నమ్మ ఎంతో చురుగ్గా ఉంటుంది. పాఠ్యపుస్తకాల్లో లేని ఎన్నో ఆసక్తికరమైన విషయాలను మాకు చెబుతుంటుంది. ఎప్పుడైనా పండగలు, ఇతర వేడుకల సమయంలో ఎక్కువ ఆహార పదార్థాలను వండాల్సి వచ్చినప్పుడు.. చాలా అరుదుగా మాత్రమే ఎల్పీజీ సిలెండర్ను వాడతాం’ అంటోంది శ్రేయ. Tags :
నాకు ఇద్దరు పిల్లలు. వారిలో బాబుకి ఆటిజం ఉంది. అమ్మాయికి పెళ్లయ్యింది. మా వారు ఐదేళ్ల క్రితం చనిపోయారు. ‘ఎలాగూ ఆస్తి మాకే చెందుతుంది కదా! నీ తదనంతరం వరకూ ఎందుకు ఇప్పుడే ఇచ్చేయమంటూ’ కూతురూ, అల్లుడూ అడగడంతో పదెకరాల పొలాన్ని వారికి రాసిచ్చేశా. దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ మధ్య ఇంటి అవసరాలకు వాళ్లనే డబ్బులు అడగాల్సి రావడం ఇబ్బందిగా ఉంది. పైగా ప్రతి రూపాయీ లెక్క చెప్పమని అడుగుతున్నారు. చట్టం నాకేమైనా సాయం చేస్తుందా? - ఓ సోదరి మీరు ఆస్తి రాసిచ్చి చాలా పెద్ద పొరపాటు చేశారనిపిస్తోంది. మానసిక ఎదుగుదల లేని మీ అబ్బాయి పోషణ భారం వాళ్లు భరించేలా ముందే ఒప్పందం చేసుకుని ఉండాల్సింది. లేదా ఆస్తి బాబు పేరు మీద ఉంచి అతడి తదనంతరం వాళ్లకు చెందేలా రాసినా బాగుండేది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. సీనియర్ సిటిజన్ యాక్ట్- 2007లోని సెక్షన్ 23(1) ప్రకారం బిడ్డలు తమ పేరు మీద ఆస్తులు రాయించుకున్న తర్వాత తల్లిదండ్రులను సరిగా చూడకపోయినా, పోషణకు అవసరమైన సాయం చేయకపోయినా ఆస్తిని తిరిగి తీసుకునే హక్కు ఇమ్మని కోర్టుని/ట్రిబ్యునల్ని కోరవచ్చు. అలానే సెక్షన్ 23(2) ద్వారా ఆస్తి మీద వచ్చే ఆదాయం నుంచి జీవన భత్యం అడగవచ్చు. ట్రిబ్యునల్ మీ అమ్మాయి, అల్లుడికి నోటీసులు ఇచ్చి వారిని పిలిపించి విచారిస్తుంది. తర్వాత మీకు జీవనభత్యం ఇప్పించడమో లేదా ఆస్తిని తిరిగి తీసుకునే అధికారమో కల్పిస్తుంది. అందుకోసం ముందు మీరు సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్లో ఫిర్యాదు చేయండి. దీన్ని స్వయంగానే కాకుండా పోస్ట్ ద్వారానూ పంపించొచ్చు. ఏదైనా త్వరగా నిర్ణయం తీసుకోండి. Tags :
మతిమరుపా... ఇవి తినండి! దివ్యకు ఇంట్లో ఏ వస్తువును ఎక్కడ పెడుతుందో గుర్తే ఉండటం లేదు. అఖిల మతిమరుపుతో చదివిన పాఠాలనే మళ్లీ మళ్లీ చదువుతోంది. దీనంతటికీ కారణం జ్ఞాపకశక్తి లేకపోవడమే. కొన్ని రకాలైన పదార్థాలు, కూరగాయలను తినే ఆహారంలో భాగం చేసుకుంటే మెదడు చురుగ్గా మారుతుంది. అంతేకాదు జ్ఞాపకశక్తినీ మెరుగుపరుచుకోవచ్చంటున్నారు ఆహార నిపుణులు. అవేమిటంటే... చేపలు, గుడ్లు మాంసాహారం తీసుకునే అలవాటున్నవారు రోజూ చేపలను ఆహారంలో చేర్చుకోవాలి. వీటిలోని ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్లు మెదడుకు ఆరోగ్యాన్ని అందించి జ్ఞాపకశక్తిని పెంచుతాయి. అంతేకాదు ఒత్తిడి నుంచి కూడా దూరం చేసి సంతోషంగా ఉంచుతాయి. అలాగే గుడ్డులోని విటమిన్-బి6, బి12, ఫోలేట్ జ్ఞాపకశక్తి పెరిగేలా చేస్తాయి. మెదడులోని చక్కెర స్థాయులను తగ్గించి ఆరోగ్యంగా ఉంచుతాయి. బ్రకోలీ దీంట్లో విటమిన్-కె అధికంగా ఉంటుంది. ఇది మెదడును ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంచుతుంది. మార్కెట్లో విరివిగా దొరుకుతున్న దీన్ని ఆహారంలో భాగం చేసుకుంటే ఇలాంటి ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. గుమ్మడి గింజలు వీటిలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మెదడును మాత్రమే కాకుండా శరీరాన్నీ ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ గింజల్లోని మెగ్నీషియం, ఐరన్, జింక్, కాపర్ శరీరంలోని నరాల వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి తోడ్పడతాయి. వీటివల్ల జ్ఞాపకశక్తీ పెరుగుతుంది. డార్క్ చాక్లెట్ కోకోపౌడర్, డార్క్ చాక్లెట్లులోని ఫ్లవనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్స్ మెదడును శక్తివంతం చేస్తాయి. ఆలోచనాశక్తి, జ్ఞాపకశక్తినీ పెంచుతాయి. Tags :
మేము సైతం సాధించగలం ఒంటికాలితో దేశం చుట్టేసి...! అన్నీ బాగుండి, ఆరోగ్యంగా ఉన్నా... నాలుగడుగులు వేయడానికే మనం ఆలోచిస్తాం. కానీ తాన్యాదాగా అందుకు భిన్నం... ఒంటికాలితోనే 3800 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ దేశాన్ని చుట్టేసింది.అదీ తన కోసం కాదు...క్రీడల్లో రాణించాలనుకుంటోన్న దివ్యాంగులకు చేయూతనందించేందుకు...ఆ వివరాలన్నీ తెలుసుకోవాలంటే ఆమె స్ఫూర్తికథ మనమూ చదవాల్సిందే. ‘మార్చలేని గతాన్ని గురించి ఆలోచించే కంటే...చేతిలో ఉన్న భవిష్యత్తు గురించి శ్రమిస్తే విజయం మనదే అని నమ్మా. ఆ నమ్మకమే చావు అంచుల వరకూ వెళ్లిన నన్ను పారాసైక్లిస్ట్గా మార్చింది’ అంటోంది పాతికేళ్ల తాన్యా దాగా. ఆమెది మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్ జిల్లాలో ఉన్న బ్యావరా పట్టణం. 2018లో తాన్యా ఎంబీఏ చదివేందుకు ఊరిని వదిలి దేహ్రాదూన్ వెళ్లింది. చక్కగా చదువుకుంటోంది. ఉన్నత ఉద్యోగం కోసం ప్రణాళికలు వేసుకుంటూ సంతోషంగా సాగిపోతోంది. కానీ జీవితమంటే ఊహించనివి జరగడమే కదా! ఆ ఏడాదే ఓ కారు ప్రమాదంలో తాన్యాకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం తనని ఇండోర్లోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. రెండు శస్త్రచికిత్సలు చేసి ఒక కాలుని తొలగించారు. అయినా సరే ఆమె బతకడం కష్టమని చేతులెత్తేశారు డాక్టర్లు. కానీ తాన్యా తల్లిదండ్రులు...ఆశను వదులుకోలేదు. కూతుర్ని ఎలాగైనా బతికించుకోవాలనుకున్నారు. మెరుగైన చికిత్స కోసం దిల్లీకి తరలించారు. సుమారు ఆరునెలల పాటు చికిత్సలు జరిగాయి. క్రమంగా ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది... వారి కథలు విని... తాన్యా ప్రమాదం తాలూకు గాయాల నుంచి బయటపడింది. కానీ కాలు లేదన్న వాస్తవాన్ని జీర్ణించుకోవడం మాత్రం కష్టమైంది. అందరూ చూపించే సానుభూతితో భవిష్యత్తు గురించి బెంగ పెట్టుకుంది. దాంతో ఆమెకు ధైర్యం నూరిపోయడానికి తాన్యా సన్నిహితులొకరు ‘ఆదిత్యమెహతా ఫౌండేషన్’ గురించి చెప్పారు. వికలాంగ క్రీడాకారులకు చేయూతనిచ్చే సంస్థ ఇది. అక్కడే తనలాంటివారెందరో నిలదొక్కుకున్న కథల్ని విని స్ఫూర్తి పొందింది. తానూ పారాస్పోర్ట్స్లో దేన్నైనా ఎంచుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంది. అయితే ఆమె అమ్మానాన్నలు ఒంటికాలు పిల్ల ఇవన్నీ చేయగలదా అని భయపడ్డారు. కానీ తాన్యా మాత్రం నిబ్బరంగా ముందడుగు వేసింది. శిక్షణ తీసుకునేందుకు వారికి నచ్చజెప్పింది. బాధల్ని దిగమింగుకుంటూ... శిక్షణ, సాధన చెప్పినంత సులువేం కాదు...పంటికింద నొప్పిని భరిస్తూ ప్రాక్టీస్ చేసింది. మొదట్లో సైకిల్ ఎక్కడానికి కూడా కష్టపడేది. కానీ అక్కడి కౌన్సెలర్లు క్రమంగా తాన్యాలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. దాంతో చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకుంటూ ముందడుగు వేసింది. మొదట 100 కిలోమీటర్ల సైక్లింగ్ పూర్తి చేసింది. తర్వాత వేలకిలోమీటర్లు సైకిల్ తొక్కే సామర్థ్యాన్ని పెంచుకుంది. ‘నాకు చిన్నప్పటి నుంచీ ఆటలంటే ఇష్టం. కానీ ఎప్పుడూ దాని గురించి ప్రణాళిక వేసుకోలేదు. ఇప్పుడు ఇదే నా ఫుల్టైమ్ కెరీర్గా మారింది’ అని చెబుతోంది తాన్యా. ఆదిత్య మెహతా ఫౌండేషన్ ఏటా పారా క్రీడాకారుల కోసం నిధులు సేకరిస్తుంది. అందుకోసం ఏర్పాటు చేసిన ‘ఇన్ఫినిటీ రైడ్-2020’కి ఈసారి తాన్యాను ఎంపిక చేసింది. మొత్తం 30 మంది పారా సైక్లిస్టులు ఈ బృందంలో తాన్యా ఒక్కరే అమ్మాయి. తండ్రి చనిపోయినా... ఈ ప్రయాణం కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకూ... నలభై మూడు రోజుల పాటు సాగింది. ‘వేల మైళ్లదూరం ఒంటికాలితో సైకిల్ తొక్కడం వల్ల కాలి కండరాలు మెలి పెట్టేసేవి. భుజాలు, పాదాలు భరించలేనంత నొప్పిగా ఉండేవి అయినా సరే! ఏ రోజుకారోజు రెట్టించిన ఉత్సాహంతో వెళ్లేదాన్ని. అయినా నన్ను విధి పరీక్షించాలనుకుందేమో! ఓ రోజు నాన్న చనిపోయారనే ఫోన్కాల్ విని గుండెలవిసేలా ఏడ్చా. వెంటనే ఊరు వెళ్లిపోయా. అంత్యక్రియలు పూర్తయ్యాక తిరిగి ఎక్కడ ప్రయాణాన్ని ఆపానో అక్కడే తిరిగి మొదలుపెట్టా. నాన్న నా కాళ్లమీద నేను నిలబడాలని కోరుకున్నారు. ఆయన కోసమైనా నేను గెలవాలి’ అని చెబుతోందామె. తాన్యాకి రాజ్గఢ్ పోలీసు శాఖ, మధ్యప్రదేశ్ ప్రభుత్వం కలిసి ‘యూత్ ఐకాన్ ఆఫ్ రాజ్గఢ్-2021’, ‘బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్’ అవార్డులతో సత్కరించాయి. Tags :
స్టార్ట్.. కెమెరా.. ఆక్షన్ అందరి చూపూ ఆమెవైపు ఐపీఎల్ వేలం అంటే ఎంత హడావుడి ఉంటుందో తెలిసిందే కదా! అందరి చూపూ అటువైపే. వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు, సినీతారలు ఇలా సెలబ్రిటీలతో నిండిపోయే ఈ వేదికలో సన్రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్హెచ్)టేబుల్ దగ్గర ఉన్న ఒక అమ్మాయి ఈసారి అందరి దృష్టినీ ఆకర్షించింది. కానీ ఆ అమ్మాయికి, టీమ్కి ఉన్న సంబంధమేంటో ఎవరికీ అర్థం కాలేదు. దాంతో నెటిజన్లంతా ఆమెని ‘మిస్టీరియస్ గాళ్’గా పిలవడం ప్రారంభించారు. నెట్లో ఐపీఎల్ ఆక్షన్ గాళ్ అంటూ వెతకడం ప్రారంభించారు. ఇంతకీ ఆ అమ్మాయి మరెవరో కాదు సనరైజర్స్ హైదరాబాద్ టీమ్కి సీఈవోగా వ్యవహరిస్తున్న కావ్యామారన్. సన్నెట్వర్క్ అధినేత కళానిధిమారన్, కావేరి మారన్ల కూతురే ఈ కావ్యామారన్. చెన్నైలోని స్టెల్లామారిస్ కాలేజీ నుంచి బీకాంలో డిగ్రీ పూర్తిచేసిన ఈ అమ్మాయి తర్వాత న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి ఎంబీయే చేసింది. అమెరికా నుంచి వస్తూనే సన్ నెట్వర్క్కు చెందిన సన్మ్యూజిక్, ఎఫ్ఎమ్ ఛానెల్స్ వంటి బాధ్యతలని తీసుకుంది. క్రికెట్ అంటే ప్రాణం పెట్టే కావ్య... రెండేళ్ల క్రితం ఎస్ఆర్హెచ్ టీమ్కి సీఈవోగా మారింది. పదిలక్షలమంది సబ్స్క్రైబర్స్ ఉన్న సన్నెక్ట్స్(ఓటీటీ) బాధ్యతలను చూస్తూ ఆ వేదికని పరుగులు పెట్టిస్తోంది. Tags :
ఆమె నొసటన అరుణ తిలకం! కాలిఫోర్నియాలోని నాసా మిషన్ కంట్రోల్రూమ్ అది... భరించరాని ఉత్కంఠ అందరిలోనూ! గుండుసూది పడినా వినపడేంత నిశబ్ధం అలుముకుందక్కడ.. ఆ నిశబ్ధాన్ని, ఉత్కంఠను ఛేదిస్తూ ‘నేలను తాకింది’ అని ఆమె ఉద్వేగభరితంగా అన్న మాటలు అక్కడున్న శాస్త్రవేత్తల్లో పట్టరాని సంతోషాన్ని నింపాయి. ఆమె మాటలే కాదు... ఆమె నుదుటన భారతీయతను ప్రతిబింబించేలా ఉన్న గుండ్రని బొట్టు కూడా ఈ రోజు ప్రపంచాన్ని ఆకర్షించింది.. అంగారక గ్రహంపైకి చేరిన పర్సీవరెన్స్ రోవర్కి ల్యాండింగ్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న స్వాతీమోహన్ సాధించిన విజయం ఏంటో తెలుసుకుందాం.. ఏడాది పసిపిల్లగా ఉన్నప్పుడు స్వాతి ఈ దేశాన్ని వదిలి కుటుంబంతో సహా అమెరికాలో అడుగుపెట్టింది. వెళ్తూవెళ్తూ ఆ కుటుంబం ఈ దేశం కట్టూబొట్టుని, సంస్కృతిని తీసుకెళ్లడం మర్చిపోలేదు. బెంగళూరులో పుట్టిన స్వాతి... పెరిగిందంతా నార్తర్న్ వర్జీనియాలోనే. చిన్నప్పటి నుంచి పిల్లల డాక్టరు కావాలని కలలుకందామె. కానీ తొమ్మిదేళ్లప్పుడు ఆమె చూసిన ‘స్టార్ ట్రెక్’ సైన్స్ ఫిక్షన్ ఎపిసోడ్లు తనని ఎంతగా ప్రభావితం చేశాయంటే కొత్త కెరీర్వైపు ఆమె దృష్టిని మళ్లించాయి. విశ్వంలో సరికొత్త ఆవిష్కరణలు చేయడమే తన లక్ష్యంగా మార్చుకుంది స్వాతి. పదహారేళ్ల వరకూ ‘అమ్మో సైన్సా’ అని భయపడిన స్వాతి మొదటి సారి ఫిజిక్స్ క్లాసు విన్న తర్వాత ఆ అభిప్రాయాన్ని మార్చుకుంది. కారణం తన సైన్స్ టీచర్. ఆ టీచర్ ఆమెలో భయాన్ని తరిమేశారు. ఇక అక్కడ నుంచి ఆమె శాస్త్రవేత్త అవ్వాలనే తన ఆలోచన సరైనదేనా అని ఎప్పుడూ ఆలోచించాల్సిన అవసరం రాలేదు. కార్నెల్ విశ్వవిద్యాలయం నుంచి మెకానికల్ అండ్ ఏరోస్పేస్లో ఇంజినీరింగ్ పూర్తిచేశారు. ఎమ్ఐటీ నుంచి ఏరోనాటిక్స్లో పీహెచ్డీని పూర్తిచేశారు. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని పసడేనాలో ఉన్న జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీలో శాస్త్రవేత్తగా విధులు నిర్వహిస్తున్నారు. అందమైన అరుణగ్రహం... శాస్త్రవేత్తలకు ఎప్పుడూ సవాళ్లను విసురుతూనే ఉంది. తనలోని మార్మికతను వెతకమన్నట్టుగా పరిశోధకులకు ఆహ్వానం పలుకుతూనే ఉంది. ఆ క్రమంలోనే ఎనిమిదేళ్ల క్రితం మొదలైంది నాసా ఆధ్వర్యంలోని ప్రతిష్ఠాత్మక మార్స్ 2020 ప్రాజెక్టు. అంతకు ముందు శనిగ్రహంపైకి పంపిన కెశీని.. చందమామపైకి పంపిన గ్రెయిల్ ప్రాజెక్టుల్లో కీలకపాత్ర వహించి తనని తాను నిరూపించుకున్న స్వాతికి ఈ ప్రాజెక్టుల్లో మరిన్ని బాధ్యతలని అప్పగించింది నాసా. ఆ సంస్థ పంపించే పర్సీవరెన్స్రోవర్ లక్ష్యం అంగారక గ్రహంపై ఉన్న జెజిరో క్రాటర్గా పిలిచే ప్రాంతాన్ని చేరుకోవడం. అక్కడకే ఎందుకూ అంటే... ఒకప్పుడు నీటితో నిండినదిగా భావిస్తున్న ఈ డెల్టా ప్రాంతంలో పరిశోధనలు చేస్తే అక్కడి ప్రాణికోటి సంచారం గురించిన సమాచారం తెలియొచ్చనేది శాస్త్రవేత్తల గట్టి నమ్మకం. కానీ అక్కడి వరకూ ఓ రోవర్ని పంపించడం అంటే మాటలు కాదు. కోటానుకోట్ల కిలోమీటర్లు ప్రయాణం చేసి అక్కడకు చేరుకున్న తర్వాత అంగారక గ్రహంపై రోవర్ ల్యాండ్ అవ్వడంలోనే అసలు సవాల్ దాగి ఉంది. ఆ ల్యాడింగ్ కంట్రోల్ వ్యవస్థ బాధ్యతలను స్వాతి తీసుకున్నారు. మార్స్ 2020 గైడెన్స్, నావిగేషన్, కంట్రోల్ ఆపరేషన్స్ వంటివి ఆమె ఆధ్వర్యంలోనే జరుగుతాయి. ఈ మిషన్లో భాగమైన జీఎన్సీ టీమ్ని సైతం ఆమె ముందుండీ నడిపిస్తున్నారు. ‘ఈ ప్రాజెక్టును 2013లో ప్రారంభించాం. ఎనిమిదేళ్ల కష్టం మాది. ఏడు నెలల క్రితం రోవర్ అంతరిక్షంలో ప్రయాణం మొదలుపెట్టినప్పట్నుంచీ మాకు సవాల్ మొదలైంది. గురువారం రాత్రి మా ప్రయోగం ఫలితాలు అందే సమయం. ల్యాండ్ అవ్వడానికి ముందు మేం పడిన టెన్షన్ మాటల్లో చెప్పలేనిది. గత ఏడాది కొవిడ్-19 నేపథ్యంలో శాస్త్రవేత్తలందరినీ ఇళ్లకు వెళ్లిపొమ్మన్నారు. మాకా సమయం చాలా కీలకమైంది. అందుకే నేను ఇంటి నుంచీ పనిచేసేదాన్ని. క్షణం కూడా వృథా చేయలేదు. నా కష్టం ఫలించింది. ఈ రోవర్ తీసుకొచ్చే మట్టిపై చేసే పరిశోధనలు మనకెంతో ఉపయోగపడతాయి’ అనే స్వాతికి వివాహమై ఇద్దరు పిల్లలున్నారు. భారతీయ కట్టూ, బొట్టుకు విలువనిచ్చే స్వాతి తన శిరోజాలని ప్రత్యేకంగా అలంకరించుకున్నారు. బొట్టుకు విలువనిచ్చే స్వాతిని ప్రపంచంలోని భారతీయులంతా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. Tags :
నీకు అర్హత లేదన్నారు..! అరుదైన వ్యాధి శరీరాన్ని శిథిÅలం చేస్తున్నా... అడుగు కదిపితే చాలు.. ఎముకలు విరిగిపోతున్నా... చక్రాల కుర్చీ నుంచి కిందికి దిగే అవకాశం లేకున్నా... ఆమె సాధించింది. అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది. త్వరలో వైద్యురాలు కాబోతున్న ఈ ఫాతిమా కథ అందరికీ ఓ స్ఫూర్తి పాఠం. కేరళలోని పూనూరు గ్రామంలో ఓ పేద కుటుంబంలో పుట్టింది ఫాతిమా. కుందనపు బొమ్మలా ఉన్న బిడ్డను చూసి కన్నవారు మురిసిపోయారు. ఆ ముచ్చట మూడు రోజులు కూడా నిలవలేదు. చేతి ఎముక విరిగితే పసిపిల్ల కదా.. బలహీనమనుకుని చికిత్స చేయించారు. కొద్దిరోజులకు మరో చేతి ఎముకకు అదే పరిస్థితి ఎదురైంది. ఏడాదిలోపు ఆ చిన్నారికి పలుమార్లు ఇలాగే జరిగింది. వైద్యపరీక్షల్లో అరుదైన ఎముకల వ్యాధిగా తేలింది. దాంతో కూప్పకూలిపోయింది ఫాతిమా తల్లి అమీనా. చిన్నారి ఎముకల్లో బలం ఉండదని, ఏ సమయంలోనైనా విరిగిపోయే ప్రమాదం తరచూ ఎదురవుతూనే ఉంటుందని వైద్యులు హెచ్చరించారు. ఏ మాత్రం శ్రమ కలిగినా ప్రాణానికే హాని అని చెప్పారు. ఫాతిమా తండ్రి అబ్దుల్ చిరువ్యాపారి. ఆయన తెచ్చే ఆదాయమే ఆ కుటుంబానికి ఆధారం. అలాంటి సమయంలో మెరుగైన చికిత్సనూ ఇప్పించలేని పరిస్థితి వారిది. చదివించాలనుకున్నారు.. ఫాతిమా సమస్యలకు చదువే పరిష్కారం చూపించగలదని నమ్మారా తల్లిదండ్రులు. దాంతో ఆమెను స్థానిక ప్రభుత్వపాఠశాలలో చేర్పించారు. రోజూ ఫాతిమాను ఆమె తల్లి ఎత్తుకుని తీసుకెళ్లి స్కూల్లో దింపి, సాయంత్రం తెచ్చుకునేది. అందరిలా బెంచీపై కూర్చోలేని ఫాతిమా కోసం ప్రత్యేకంగా ఓ కుర్చీని వేసేది. తరగతిలో ఈమెతో ఎవరూ స్నేహం చేసేవారుకాదు. తాను చదువులో చురుకుగా ఉంటే అందరూ తన దగ్గరకు వస్తారని భావించిందామె. దాంతో మంచి మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నించేది. అలా పదోతరగతిలో 90 శాతం మార్కులు సాధించింది. ఈలోపు ఎన్నోసార్లు ఆమెకు ఎముకలు విరగడంతో సర్జరీలు జరిగాయి. తరచూ ఆసుపత్రిపాలయ్యేది. చికిత్సకు తల్లిదండ్రులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడేవారు. తెలిసినవారు, ఆసుపత్రి నిర్వాహకులు వీరికి సాయం చేసేవారు. ఎక్కువగా ఆసుపత్రిలోనే గడిపే ఫాతిమాకు వైద్యవృత్తిపై ఆసక్తి పెరిగింది. అదే తన లక్ష్యమైంది. ఆశ్చర్యంగా చూసారు... ఎంబీబీఎస్లో చేరడానికి ఫాతిమా ప్రయత్నించింది. అయితే ఆమె వైకల్యం అవరోధమైంది. దాంతో ‘బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతి మెడిసిన్ అండ్ సర్జరీ’ కోర్సులో చేరడానికి ప్రవేశ పరీక్షరాసి, ఉత్తీర్ణత సాధించింది. తను ఈ ఉన్నత స్థితికి చేరుకోవడానికి పడిన కష్టాలను ఆమె చెబుతోందిలా.. ‘దివ్యాంగుల విభాగంలో ఇంటర్వ్యూకు అర్హత సాధించా. తీరా లోపలకి వీల్ఛెయిర్లో వెళ్లిన నన్ను అక్కడి మెడికల్ బోర్డు సభ్యులు ఆశ్చర్యంగా చూశారు. ఆ తర్వాత నీకు ఈ కోర్సు చదవడానికి అర్హత లేదు, వెళ్లిపొమన్నారు. ఒక్కసారే నా గుండె ఆగిపోయినంత పనైంది. కన్నీళ్లతో తిరిగొచ్చేశా. అయితే అక్కడితో ఆ విషయాన్ని వదల్లేకపోయా. చక్రాల కుర్చీ చూసి నేను అసలు నడవలేనిదాన్ని అనుకున్నారంతా. అందుకే ఊతకర్రలతో నడిచి చూపించాలనుకున్నా. పాదాలను కిందపెడితే ఎముకలు విరిగే ప్రమాదముంది. అయినా నా లక్ష్యం ముందు అవి కష్టమనిపించలేదు. క్రచ్చెస్తోనే నడవడం అమ్మ నేర్పింది. ఆ తరువాత ఏడాదికి మళ్లీ ఇంటర్వ్యూకి వెళ్లా. నా పట్టుదలతో సీటు దక్కించుకున్నా. తెలిసినవాళ్లు ఆర్థికసాయం చేశారు. అలా కొట్టాయం మెడికల్ కాలేజీలో చేరా. మూడో ఏడాదిలో తొడ ఎముక విరగడంతో శస్త్రచికిత్స జరిగింది. దాదాపు ఆరునెలలపాటు మంచంలోనే ఉన్నా. పరీక్షలకు హాజరుకాలేకపోయా. యూట్యూబ్ వీడియోలు, పుస్తకాల ద్వారా చదువుకునేదాన్ని. ఆ తర్వాత ఏడాది పరీక్షలు రాసి 85 శాతం మార్కులను సాధించి నేనంటే ఏంటో నిరూపించా. ఈ ఏడాది నా కోర్సు పూర్తి కానుంది. పేదలకు ఉచితంగా వైద్యం అందించడం నా లక్ష్యం. ఇప్పటికీ అమ్మానాన్న నన్ను చేతుల్లో మోసి మరీ కుర్చీలో ఉంచుతారు. వాళ్లని గర్వించేలా చేయాలనేదే నా ఆశ. అలాగే బాల్యం నుంచి నా మనసులో పేరుకుపోయిన పలు విషయాలను, ఉద్వేగాలను కథలు, కవిత్వంగా రాసి ‘యూ గో గర్ల్’ పేరుతో పుస్తకంగా ప్రచురించా.’ అని చెబుతోంది ఫాతిమా. సొంతంగా.. నాలుగేళ్లక్రితం సొంతంగా ‘డ్రీమ్ బియాండ్ ఇన్ఫినిటీ’ పేరుతో యూట్యూబ్ ఛానెల్ను ప్రారంభించింది. దీనికి వేలల్లో సబ్స్రైబర్స్ ఉన్నారు. అంతేకాదు, టెడెక్స్, పలు విద్యాసంస్థల్లో వేదికలపై స్ఫూర్తి ప్రసంగాలిస్తోంది. Tags :
...ప్రతి అడుగూ కష్టమైంది! అది ఫిబ్రవరి ఏడోతేదీ అర్ధరాత్రి. ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లా జోషిమఠ్ ప్రాంతం. కొన్ని గంటల క్రితం అక్కడ మరణమృదంగం మోగించిన ధౌలీగంగ నది ఏమీ ఎరగనట్టు ప్రశాంతంగా ఉంది. పక్కనే జలవిద్యుత్తుకేంద్రం సొరంగం వద్ద ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) దళాలు ముమ్మరంగా సహాయచర్యలు చేపడుతున్నాయి. ఈ ఆపరేషన్కు నేతృత్వం వహించారు డీఐజీ అపర్ణాకుమార్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతశిఖరాలను అధిరోహించిన తొలి మహిళా పోలీసుగా నిలిచారు. ప్రకృతి విపత్తుల్లో పలు కష్టతరమైన ఆపరేషన్స్కు సారథ్యం వహించారు. ఈ అనుభవంతో ఉత్తరాఖండ్ ఆపరేషన్లో ఎందరినో కాపాడిన అపర్ణ తన అనుభవాలను ‘వసుంధర’తో పంచుకున్నారు. ఈ నెల ఏడోతేదీ ఉత్తరాఖండ్లో జరిగిన జల విలయం గురించి ఉదయం 10 గంటల తర్వాత వెలుగులోకి వచ్చింది. గంటలోపే సహాయక చర్యల్లో పాల్గొనాలని మాకు సమాచారం అందింది. వెంటనే చమోలీ జిల్లాకు రెండు బెటాలియన్స్ను రెస్క్యూ ఆపరేషన్ కోసం రుషిగంగ, తపోవన్ ప్రాంతాలకు పంపించా. అరగంటలోపే వారంతా హెలీకాప్టర్ ద్వారా అక్కడికి చేరుకున్నారు. అతి తక్కువ సమయంలోనే అక్కడివారికి చేయూతనందించడానికి మా బృందం సిద్ధమైంది. దెెహ్రాదూన్ నుంచి బయలుదేరి నేనూ అక్కడికి చేరుకున్నా. 12 మంది... మా మౌంటెనీరింగ్ టీం జోషిమఠ్ నదీ తీరప్రాంతంలో ప్రాణాపాయంలో ఉన్న కొందరిని గుర్తించి రక్షించగలిగింది. రుషిగంగ హైడ్రోప్రాజెక్టు వద్ద స్థానికులతో మాట్లాడి, ఏ ప్రాంతంలో బాధితులు చిక్కుకుని ఉంటారని అడిగా. సిల్ట్ ఫ్లషింగ్ టన్నెల్ (ఎస్ఎఫ్టీ) వద్ద అని అన్నారంతా. అక్కడ పెద్దపెద్ద బండరాళ్లు, మధ్యలో బురద, మంచు అన్నీ కలిసి కూరుకుపోయి ఉన్నాయి. మా టీమ్ సాయంతో మౌంటెనీరింగ్ ఎక్విప్మెంట్ను తెప్పించి ఆ రాళ్లను పగలగొట్టించా. అక్కడ ప్రాణాలతో ఎవరైనా ఉంటే వారిని రక్షించాలనేదే మా లక్ష్యం. అలా 20 మీటర్ల లోతు వరకు మట్టిని తొలగించాక లోపల ఎవరో ఉన్నట్లు గుర్తించాం. తాళ్లు వేసి మట్టి అడుగుభాగాన ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉన్న 12 మందిని బయటకు లాగాం. వారిని జోషిమఠ్ ఆసుపత్రికి తరలించాం. వీరిలో శ్రీశైలానికి చెందిన 45 ఏళ్ల జియాలజిస్ట్ కూడా ఉన్నారు. మరోవైపు..: తపోవన్ ఎన్టీపీసీ టన్నెల్ సమీపంలోని గ్యారేజ్ దగ్గర 30 మీటర్ల దూరం బురద, మట్టి, మంచు పేరుకుపోయాయి. రెండున్నర కిలోమీటర్ల పొడవుండే ఆ టన్నెల్లో 39 మంది చిక్కుకున్నట్లు సమాచారం అందింది. అక్కడ చిక్కుకున్న వారిని రక్షించడం అత్యంత సవాల్గా మారింది. గంటల సమయం పట్టింది. ప్రతి అడుగూ కష్టమైంది. కనీసం నిలబడలేని ఆ ప్రాంతంలో ఎలాగో మా టీం సభ్యులు కొంతదూరం మాత్రమే వెళ్లగలిగారు. అందులో చిక్కుకున్నవారిని ప్రాణాలతో కాపాడటానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. మాతోపాటు బాధితుల కుటుంబసభ్యులు, స్నేహితులు కూడా నిరంతరం పనిచేశారు. ఇప్పటికీ సైంటిస్ట్లు, ఇంజినీర్లు, ప్రాజెక్టు మేనేజర్లు, కార్మికులందరూ మట్టిని తొలగించడానికి సాయపడుతున్నారు. ధౌలీగంగ ప్రవాహానికి ఓ వంతెన కూలిపోవడంతో అక్కడ 13 గ్రామాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. వారందరికీ ఆహారం, తాగునీరు, నిత్యావసర వస్తువులను హెలీకాప్టర్ ద్వారా మా దళాలు అందించాయి. ఇంత విషాదాన్ని ఎప్పుడూ చూడలేదు. నా కెరీర్లో అత్యంత వేదన కలిగించిన ఆపరేషన్ ఇది. Tags :
బిర్యానీ రుచికి తలపాగా చుట్టారు! తలపాగా... నిండైన ఆత్మగౌరవానికి నిదర్శనం... తమ ప్రాంత చిహ్నంగా మారిన రుచికరమైన బిర్యానీకీ తలపాగా పేరే పెట్టుకున్నారు తమిళనాడులోని దిండిగల్వాసులు.ఆ ఆత్మగౌరవానికి, మరింత సృజనాత్మకతను జోడించిన దీపిక ‘తలపాకట్టి బిర్యానీ’ రుచిని ఖండాంతరాలకు వ్యాపింపజేశారు. కేవలం అయిదే సంవత్సరాల్లో రూ.200 కోట్ల వ్యాపారంగా మార్చారు... తమిళనాడులోని దిండిగల్ వెళ్లి ఆనంద విలాస్ గురించి అడిగితే చాలు... అక్కడి వాళ్లు దారి చూపించడమే కాదు, అక్కడి బిర్యానీ గురించి గొప్పగా చెబుతారు. ఆనంద్ విలాస్ను ప్రారంభించింది నాగసామి నాయుడు. 1957లో ఆయన దిండిగల్లో ఓ చిన్న సంస్థలో అకౌంటెంట్గా పనిచేసేవారు. ఆయన సతీమణి కన్నమ్మాళ్ ప్రత్యేకమైన పద్ధతిలో బిర్యానీ తయారు చేసేవారు. బయట ఎక్కడ తిన్నా ఆ రుచి వచ్చేది కాదు. దీంతో బంధువులు, స్నేహితులు తెగ మెచ్చుకునేవారు. అప్పుడు నాగసామికి వచ్చిన ఆలోచనే ఆనంద విలాస్గా మారింది. తలపాగా చుట్టుకునే అలవాటున్న నాగసామి ఈ బిర్యానీకి బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. ఆయన తలపాగా పేరుమీదే ఇది తలపాకట్టి బిర్యానీగా మారింది. కానీ ఆ రుచికి వెనక ఉన్నది మాత్రం ఆయన సతీమణి కన్నమ్మాళ్. ఆమె తయారీ విధానంతోనే దానికంత పేరొచ్చింది. ఆపేరు దిండిగల్ దాటి తమిళనాడు అంతా వ్యాపించింది. నాగసామి నాయుడు తర్వాత తలపాకట్టి బిర్యానీ బాధ్యతను ఆయన వారసులే స్వీకరిస్తూ వచ్చారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన దీపిక 2008లో ఈ ఇంటి కోడలుగా అడుగుపెట్టింది. తర్వాత ఆనంద్విలాస్ బాధ్యతల్లోనూ పాలుపంచుకుంది. అప్పటి నుంచి తలపాకట్టి ప్రాభవం మరో దశకు చేరుకుంది. ఆనంద విలాస్ బాధ్యత దీపిక తీసుకునే నాటికి వారి చేతుల్లో నాలుగంటే నాలుగే శాఖలు ఉండేవి. దీన్ని విస్తరించాలనుకున్న దీపిక ఆధునిక మార్కెటింగ్ పద్ధతులను అనుసరించింది. నాణ్యత విషయంలో రాజీలేని ధోరణి, విస్తృత ప్రచారాలను తన విజయ సూత్రాలుగా చేసుకున్న ఆమె అయిదేళ్లలో చెన్నై నగరంలో 27 శాఖలతో సహా తమిళనాడు, పుదుచ్చేరి, బెంగళూరుల్లో మొత్తం 79 శాఖలను ఏర్పాటుచేశారు. ‘ఈ ప్రయాణం అనుకున్నంత తేలికేం కాదు. ఏ ప్రాంతంలో మా బ్రాండ్ను పరిచయం చేయాలనుకున్నామో అక్కడ మా సర్వే టీం అధ్యయనం మొదలుపెడుతుంది. అక్కడివారి రుచులు, ఆహారంపై వారికుండే అభిప్రాయాలను సేకరిస్తుంది. దాదాపు ఆరు నెలల తర్వాతే అక్కడ శాఖను ప్రారంభించి, సెంట్రల్ కిచెన్ను తెరుస్తాం. నాణ్యత తగ్గకుండా ఉండటానికి ఎవరికీ ఫ్రాంఛైజీ ఇవ్వకుండా ప్రతి శాఖ బాధ్యతా మేమే చూసుకుంటాం..’ అంటారు దీపిక. ‘ప్రస్తుతం ప్రజల అభిరుచులు వేగంగా మారుతున్నాయి. అందుకే తొలుత బిర్యానీ, దాల్చా మాత్రమే ఉండగా, ఇప్పుడు 300 రకాలకు పైగా రుచికరమైన ప్రత్యేక వంటకాలను జత చేశాం. బిర్యానీలోనే ఏడెనిమిది రకాలున్నాయి. అలాగే ప్రముఖ పట్టణాల్లో మిడ్నైట్ బిర్యానీ అందిస్తున్నాం. కస్టమర్ కేర్ పేరుతో వినియోగదారుల అభిప్రాయాలను ప్రత్యేక వెబ్సైట్ ద్వారా సేకరిస్తాం. అంతేకాదు, ప్రతి శాఖలోనూ రాత్రికి మిగిలిన ఆహారాన్ని నిరుపేదలకు ఉచితంగా పంచిపెడతాం.’ అని వివరించారామె. ‘అమెరికా, దుబాయిల్లోనూ ఇప్పుడు తలపాకట్టి బిర్యానీ అందుబాటులోకి వచ్చింది. విదేశాల్లో మాకు తొమ్మిది శాఖలున్నాయి. ప్రస్తుతం రెండున్నరవేలమందికి ఉపాధిని అందిస్తున్నాం...’ అంటారు దీపిక. ఆమె వేసిన దినుసులే... ప్రతిచోటా బిర్యానీకి బాసుమతి రైస్ వాడితే, తలపాకట్టిలో మాత్రం దిండిగల్ ప్రాంతంలో పండే సీరగ సంబా రకం బియ్యాన్ని వాడతారు. దీనివల్ల మసాలాల రుచి ప్రతి మెతుకులోనూ తెలుస్తుంది. ఇందులో వాడే మాంసం, మసాలాల విషయంలో నాణ్యతకు పెద్ద పీట వేస్తారు. ఇప్పటికీ మసాలా పొడిని గ్రామాల్లోని మహిళలతో తయారు చేయిస్తారు. కన్నమ్మాళ్ ఎలాగైతే ఈ బిర్యానీని చేసేదో అదే రుచిని ఇప్పటికీ అందిస్తున్నారు. దీనికోసం వంటవాళ్లను కూడా మొదటి తరంలో పనిచేసిన వాళ్ల కుటుంబాల నుంచే తీసుకుంటారు. మరికొందరికి సొంతగా శిక్షణనిస్తున్నారు. తలపాకట్టికి మూలమైన కన్నమ్మాళ్ పేరు మీద ఏటా మహిళాసాధికారతకు ప్రతిరూపంగా నిలిచేవారిని ఎంపిక చేసి ‘సూపర్ ఉమెన్’ అవార్డునందించి గౌరవిస్తున్నారు. Tags :